వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేసుకుంటున్నారా ? పాదయాత్రలో జగన్ వైఖరి గమనిస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. ఇంతకీ ఆ బ్రహ్మాస్త్రం ఏమిటంటారా ? కుల సమీకరణల్లో ఇప్పటి వరకూ అణగారిన కులాలను దగ్గరకు తీసుకోవటం. ఒకరకంగా ప్రతీ ఎన్నికలోనూ చంద్రబాబునాయుడు అనుసరించే పద్దతినే వచ్చే ఎన్నికల్లో జగన్ కూడా అనుసరించబోతున్నారు. అయితే, చంద్రబాబు లాగ ఆచరణ సాధ్యం కాని హామీలనిచ్చి జగన్ నవ్వులపాలు కావటం లేదు లేండి. అధికారంలోకి వస్తే తాను అటువంటి వారికి ఏమి చేయగలను అని అనుకుంటున్నారో, తన పరిధిలో ఉన్నదేదో అదే హామీల రూపంలో ఇస్తున్నారు. దాంతో జగన్ హామీల విషయంలో జనాలు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు. అందుకనే పాదయాత్రలో జనాలు బ్రహ్మరధం పడుతున్నారు. కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల్లో పాదయాత్రకు జనాలు స్పందిస్తున్న విధానమే అందుకు నిదర్శనం.
పాదయాత్ర సక్సెస్
ఇంతకీ విషయంలోకి వస్తే, రాష్ట్ర జనాభాలో బిసి సామాజికవర్గందే అత్యధిక శాతం అన్న విషయం అందరికి తెలిసిందే. విశ్లేషకుల అంచనా ప్రకారం మొత్తం జనాభాలో బిసిలు సుమారుగా 50 శాతముంటారు. అయితే, అటువంటి బిసిల్లో మొత్తం 138 ఉపకులాలున్నాయి. రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా యాదవులు, గౌడ్లు, శెట్టిబలిజలు,, మున్నారుకాపులు, తూర్పు కాపులు, బలిజ లాంటి చాలా కొన్ని ఉపకులాలే బాగా లబ్దిపొందాయన్న విషయం అందరికీ తెలిసిందే. మిగిలిన ఉప కులాలకు చెందిన జనాల ఏ రకమైన అభివృద్ధికైనా ఆమడ దూరంలోనే ఉండిపోతున్నారు. బిసిల కోటాలో రజకులు, విశ్వబ్రాహ్మణులు, కంసాలీలు, జాలర్లు, వడ్డెర్లు లాంటి అణగారిన ఉపకులాలు చాలా ఉన్నాయి. జనాభాలో అటువంటి ఉప కులాల ప్రాతినిధ్యం ఎక్కువగానే ఉంటున్నప్పటికీ రాజకీయంగా మాత్రం ఎటువంటి పదవులు అందటం లేదు. అటువంటి వారికి తాను ప్రాధాన్యత ఇస్తానంటూ జగన్ హామీలు ఇస్తున్నారు.
మారిన జగన్ పంథా
పాదయాత్రలో కృష్ణా జిల్లా నుండి జగన్ తన పంథాను మార్చుకున్నట్లు అర్ధమవుతోంది. ప్రతీ జిల్లాలోనూ బిసిల్లో అణగారిన వర్గాలను లక్ష్యంగా చేసుకుని వారిని దగ్గరకు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకనే అటువంటి వారికి రాజకీయ ప్రాధాన్యత ఇస్తానని హామీలు ఇస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే అణగారిన వర్గాలకు ఎంఎల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, స్ధానిక బోర్డుల్లో సముచిత స్ధానం కల్పిస్తానని హామీలు ఇస్తున్నారు. ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న పశ్చిమగోదావరి జిల్లాలో కూడా జగన్ అదే ఒరవడి కొనసాగిస్తున్నారు. అందుకనే అణగారిన వర్గాల ప్రజలు జగన్ పాదయాత్రకు బ్రహ్మరధం పడుతున్నారు.
చంద్రబాబు చెప్పిదేమిటి ? జరుగుతున్నదేంటి ?
ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. పోయిన ఎన్నికల్లో కాపులకు, బోయలకు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీల్లాంటివే ఇపుడు జగన్ కూడా ఇస్తున్నారా ? అన్న అనుమానం జనాల్లో మొదలైంది. హామీల్లో తేడాలు లేవుకానీ వాటి అమల్లోనే స్పష్టమైన తేడాలున్న విషయాన్ని జనాలు కూడా గుర్తిస్తున్నారు. పోయిన ఎన్నికల్లో కాపులను బిసిల్లో చేరుస్తానని, బోయలను ఎస్టీల్లో చేరుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే, కాపులను బిసిల్లో చేర్చటమైనా, బోయలను ఎస్టీల్లో చేర్చటమైనా చంద్రబాబు చేతిలో లేదు. ఒక కులాన్ని మరో కులంలోకి చేర్చాలన్నా లేదా తొలగించాలన్నా అందుకు కేంద్రప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ఆ విషయం చంద్రబాబుకు తెలిసి కూడా జనాలను తప్పుదోవ పట్టించారు. ఎప్పుడైతే కేంద్రంతో చంద్రబాబుకు చెడిందో తన హామీలను గాలికొదిలేసి నెపాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడిపై తోసేస్తున్నారు
జగన్ హామీలమాటేంటి ?
ఇపుడు జగన్ ఇస్తున్న హామీల అమలుపై చర్చ జరుగుతోంది. జగన్ ఎక్కడ కూడా కులాలను మారుస్తానని చెప్పటం లేదు. అణగారిని కులాలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పిస్తానని మాత్రమే చెబుతున్నారు. ముఖ్యమంత్రి తలచుకుంటే ఎరికేపదవైనా ఇవ్వగలరు కదా ? జగన్ ముఖ్యమంత్రైతే అణగారిని కులాలకు ఎంఎల్సీ, కార్పొరేషన్ ఛైర్మన్లు, స్ధానిక సంస్ధల్లో ప్రాతినిధ్యం కల్పించటం కష్టమేమీకాదు. పదవుల పంపిణీ అన్నది పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణ మీద ఆధారపడి ఉన్న విషయమన్న సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టే తన హామీలను జగన్ నిలుపుకుంటారన్న నమ్మకమే జనాల్లో కనబడుతోంది. అందుకనే అటువంటి ఉప కులాల జనాలందరూ జగన్ పాదయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.
జగన్ హామీలను నమ్ముతున్నారుః శంకర్
పాదయాత్రలో జగన్ ఇస్తున్న హామీలను నమ్ముతున్నట్లు రాష్ట్ర బిసి సంఘం అధ్యక్షుడు శంకర్ చెప్పారు. నిజానికి ఇప్పటి వరకూ అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా బిసిల్లో అణగారిన వర్గాలకు సముచిత స్దానం కల్పించలేదన్నారు.
అణగారిన వర్గాల అభివృద్ధి గురించి జగన్ మాట్లాడుతున్నారు కాబట్టే బిసిలు జగన్ పట్ల ఆకర్షితులవుతున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలకు జగన్ ఇస్తున్న హామీలకు అమలులో తేడాలున్న విషయాన్ని జనాలు గ్రహించినట్లు శంకర్ తెలిపారు. తమ అంచనా ప్రకారం రాష్ట్ర జనాభాలో బిసిలు 60 శాతం ఉన్నట్లు శంకర్ చెప్పారు.