నాలుగేళ్ల మోదీ పాలన ఎలా ఉందని సర్వేలు చేస్తే., ఆయనకు మరోసారి అవకాశం ఇచ్చేందుకు దేశప్రజలు భయపడుతున్నారనే చేదు నిజం బయటపడింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మోదీకి ప్రధాని అయ్యే ఛాన్స్ ఉన్నా., ఆయన్ను సమర్థించేవారి సంఖ్య దారుణంగా పడిపోయింది. 2014 లో ఉన్నంత మద్దతు 2018 కల్లా బాగా తగ్గిపోయింది. మరో ఏడాది తర్వాత, 2019 లో అది ఏస్థాయికి వెళ్తుందో అనే కలవరం కమలదళాన్నీ పీడిస్తోంది. 21 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చామని ఆనందించకుండా., 2019 తర్వాత ఢిల్లీలో ఎలా ఉండాలన్నదానిపైనే బీజేపీ శ్రేణులు ఫోకస్ చేయటాన్ని చూస్తే., మోదీ నాలుగేళ్ల పాలన ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
మోదీ నాలుగేళ్ల పాలనపై సర్వే కమల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఏబీపీ న్యూస్-సీఎస్డీఎస్ ఈ సర్వేలో మోదీకి మరో అవకాశం ఇవ్వరాదని కోరుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉండటం నాలుగేళ్ల పాలనపై పునర్ విమర్శ చేసుకోవాల్సిన అవసరం కలిగిస్తోంది. కర్ణాటకలో అధికారాన్ని కోల్పోవడమే కాక రాజకీయంగా మచ్చతెచ్చుకున్న పరిస్థితుల్లో సర్వేలు బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టేస్తున్నాయి. అంతర్మథనానికి గురిచేస్తున్నాయి. ‘‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 32 శాతం మంది మోదీకి ఓటేస్తామని చెప్పారు. ఈ ఏడాది మొదట్లో ఇదే ప్రశ్న వేసినపుడు 34 శాతం మంది తాము బీజేపీకే ఓటేస్తామని చెప్పారని, కేవలం నాలుగునెలల వ్యవధిలో రెండు శాతం తగ్గుదల మోదీకి తగ్గుతున్న ఆదరణను సూచిస్తోందనేది సర్వే సారాంశం.
2013 జూలైలో జరిపిన సర్వేకు తాజా సర్వేకు చాలా పోలికలు ఉన్నాయి. ఆనాడు యూపీఏకు మరో ఛాన్స్ ఇవ్వాలని 39 శాతం మంది, ఇవ్వవద్దని 31 శాతం మంది పేర్కొనగా 30 శాతం మంది ఏ అభిప్రాయమూ చెప్పలేదు. అప్పట్లోలాగే తేడా కూడా ఇప్పుడు వచ్చిన 8 శాతమే. ఆ ఎన్నికల్లో యూపీఏ ఘోరంగా ఓడిపోయిందనే విషయం గమనార్హం… అవినీతి పంకిలంలో నిండా కూరుకున్న కాంగ్రెస్ కు గుణపాఠం చెబుతూ 2014లో ప్రజలు బీజేపీకి అవకాశం ఇచ్చారు. ప్రభుత్వ వ్యతిరేకతే ఏకైక నిచ్చెనగా పీఠాన్నెక్కేశారు మోదీ! అయితే ఆ తరువాత ఆయన ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదం కావడం, ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజానీకపు దైనందిన జీవిత చక్రం నిల్చిపోవడం ఈ అసంతృప్తికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఏ వర్గాలైతే బీజేపీకి బాసటగా నిలిచాయో అవే వర్గాలు ఇప్పుడు మొహం చాటేస్తున్న పరిస్థితి…
మధ్య తరగతి బీజేపీకి పెద్ద ఓటు బ్యాంకు. కానీ బ్యాంకుల సంక్షోభం, నోట్ల రద్దు వల్ల తలెత్తిన పరిణామాలు, పెట్రో ధరల పెరగుదల, నిత్యావసరాల పెరుగుదల, సామాజిక అశాంతి... ఇవన్నీ ఆ వర్గాన్ని దూరం చేశాయని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఇక వ్యాపార (బనియా) వర్గాలపై జీఎస్టీ దెబ్బ, నోట్ల రద్దు దెబ్బ బలంగా పడ్డాయి. దేశంలో మోదీ వ్యతిరేక గాలి కూడా బలంగా వీస్తోందని, ఇది మైనారిటీల్లో మరీ ఎక్కువగా ఉందని ఏబీపీ సర్వే కూడా వెల్లడించింది… ముస్లింలలో నాలుగింట మూడొంతులు, క్రైస్తవుల్లో ఐదింటి నాలుగొంతులు, సగం మంది సిక్కులు మోదీ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపింది. అయితే హిందూ ఓటర్లలో కూడా ఈ వ్యతిరేకత బాగానే ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది. హిందూ ఓటర్లలో 44 శాతం మంది మోదీ అనుకూలతను ప్రదర్శించగా, 42 శాతం మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తేలింది…
సబ్ కే సాత్.. సబ్ కే వికాస్ నినాదాన్ని 2014లో బలంగా వినిపించిన మోదీ ఆ తరువాత కూడా మైనారిటీలకు చేరువయ్యేందుకు ప్రయత్నించారు. కానీ గో సంరక్షకుల అరాచకాలు, ఉత్తర భారతావనిలో ద్వేషం ప్రజ్వరిల్లడం, కొన్ని చోట్ల మైనారిటీ వర్గానికి చెందిన వారిపై దాడులు పెరగడం, హత్యలు, తక్షణ తలాక్ వ్యవహారాన్ని రాజకీయాలకు వాడుకోవడం, కశ్మీర్లో ప్రబలిన హింస... ఇవన్నీ ముస్లింలలో అభద్రతను పెంచడమే కాక మోదీపాలన పట్ల అసంతృప్తిని ఎగదోశాయి. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద మోదీ ప్రభుత్వం సరిగా స్పందించలేదని దళిత వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి…
పాలనా వైఫల్యాలు బీజేపీకి ప్రతికూలంగా పరిణమిస్తున్నాయనే విషయం సర్వేల్లో స్పష్టమైంది. ఇదే సమయంలో పార్టీ వైఖరులు కూడా కమల దశాల్ని భయపెడుతున్నాయి. కాంగ్రెస్ ముఖ్త్ భారత్ అంటూ చేస్తున్న ప్రచారం ఎక్కడ మా కొంప ముంచుద్దో అంటూ ప్రాంతీయ పక్షాలు బీజేపీ అంటే హడలి పోతున్నాయి. 2014తో పోలిస్తే మిత్రుల సంఖ్య దారుణంగా తగ్గిపోయింది. ముఖ్యంగా దక్షిణాదిలో కమలానికి తీవ్ర గడ్డు పరిస్థితులు పొంచి ఉన్నాయి. ఉనికి కాపాడుకోవాలన్న భయంతో దేశంలో అన్ని పార్టీ పాత పగలు పక్కన పెట్టి, జెండాలు – అజెండాలు ఏకం చేసుకుంటున్నాయి. బీజేపీని ఓడించటమే లక్ష్యంగా కూటములు సిద్ధం చేసుకుంటున్నాయి.
ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే, ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, దేశ ప్రజలకు మోదీ ఒక బహిరంగ లేఖ రాసారు. ‘సేవా పరమో ధర్మః’ అనే సూక్తితో లేఖను మొదలు పెట్టిన ప్రధాని.., ప్రజలకు సేవ చేయడంలో తన అనుభవిస్తున్న తృప్తినీ, ఆనందాన్ని అక్షరమక్షరంలో ప్రస్థావించారు. అంతులేని అవినీతి రాజ్యమేలుతున్నప్పుడు, నిర్ణయాలు తీసుకోలేని అసమర్థపాలనతో జాతి నవనాడులు కుంగిపోయి వున్న టైంలో, మీరు ఎంతో నమ్మకంతో నాకు పగ్గాలు అప్పగించారు. మీ ఆశలను నిజం చేయడానికే గతేడాది కాలంగా ఆహర్నిశం శ్రమించినట్లు మూడేళ్ల క్రితమే ప్రధాన సేవకుడు తనకు తానే కితాబిచ్చుకున్నారు. ఒక ప్రధాని తనపనితీరుకు దానే మార్కులు వేసుకునే సరికొత్త సంస్కృతిని కూడా మూడేళ్ల ముందే మోదీ ప్రారంభించారు. కానీ 2019లో మోదీ సొంతంగా మార్కులు వేసుకుంటే ఢిల్లీ సీటు దక్కదు. ప్రజలు ఓట్లు వేయాలి.