ఎంతటి మేధావులైనా అనాలోచితంగా తీసుకునే నిర్ణయాలే ఒక్కోసారి బూమరాంగ్ అవుతుంటుంది. చంద్రబాబునాయుడు పరిస్ధితి ఇపుడు అదే విధంగా తయారైంది. వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ కొట్టటమే ఏకైక లక్ష్యంగా చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహించారు. దేశంలోనే అందరికన్నా అత్యంత సీనియర్ అని తన భుజాలను తానే చరుచుకునే చంద్రబాబు పూర్తిగా ఫిరాయింపుల పేరుతో నేలబారుకు దిజారిపోయారు. అలా ఇలా కాదు ఏకంగా 23 మంది వైసిపి ఎంఎల్ఏలతో పాటు ముగ్గురు ఎంపిలను ఫిరాయింపులకు ప్రోత్సహించారు. అందుకు గాను ఆకాశమే హద్దుగా ప్రలోభాలకు గురిచేశారు. సరే ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. అప్పట్లో ప్రోత్పహించిన ఫిరాయింపులే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు పెద్ద సమస్యగా మారేట్లు కనబడుతోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఫిరాయింపులే చంద్రబాబు కొంప ముంచినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నట్లుగా తయారైంది పరిస్ధితి.
గొడవలు కొంపముంచటం ఖాయమేనా ?
ఇంతకీ విషయం ఏమిటంటే, రాయలసీమలోని కడప, కర్నూలు, తూర్పుగోదావరి, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల్లో ఫిరాయింపులు ఎక్కువగా జరిగాయి. ఫిరాయింపులు జరిగిన ఏ జిల్లాలో కూడా టిడిపి నేతలకు, ఫిరాయింపు ఎంఎల్ఏలకు ఏమాత్రం పడటం లేదు. పార్టీ కార్యక్రమాల్లో ఎవరికి వారుగానే పాల్గొంటున్నారు. వీరి మధ్య సర్దుబాట్లు చేయటానికి చంద్రబాబు ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా ఏమాత్రం ఉపయోగం కనబడలేదు. కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డ, నంద్యాల, కోడుమూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, అద్దంకి, ఎర్రగొండపాలెం, అనంతపుం జిల్లాలోని కదిరి, కడప జిల్లాలోని జమ్మలమడుగు, బద్వేలు, తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట, రంపచోడవరం నియోజకవర్గాల్లో పరిస్ధితి చాలా దారుణంగా ఉంది.
సర్దుబాట్లు కుదరటం లేదా ?
ఫిరాయింపులకు, టిడిపి సీనియర్ నేతలకు మధ్య ఏ విషయంలోనూ పడటం లేదు. ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏస్ధాయిలో ఉంటుందో చంద్రబాబు ఊహింలేకపోతున్నారు. అయితే ముందుజాగ్రత్తగా ప్రజాధరణ లేని వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేది లేదని స్పష్టంగా చెబుతున్నారు. అదే రానున్న ఎన్నికల్లో టిడిపి కొంప ముంచుతుందని పలువురు టిడిపి నేతలు తీవ్ర ఆందోళన పడుతున్నారు. టిక్కెట్లు ఇస్తే ఒక ప్రమాదం, ఇవ్వకపోతే ఇంకో సమస్య అన్నట్లుగా తయారైంది. టిక్కెట్లు ఇస్తేనేమో ప్రజా వ్యతిరేకత వల్ల ఓడిపోతారని భయం. గెలుపు అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఒకవేళ ఫిరియింపులకు టిక్కెట్లు ఇవ్వకపోతే వారు ఊరుకోరుకదా ? టిక్కెట్లు దక్కని ఫిరాయింపులు టిడిపి విజయావకాశాలను దెబ్బ కొట్టటం ఖాయం. ఈ అంశమే చంద్రబాబులో ఆందోళనను పెంచేస్తోంది.
పిరాయింపులే కొంప ముంచుతారా ?
కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆళ్ళగడ్డ, కోడుమూరు నియోజకవర్గాలతో పాటు కడప జిల్లాలోని జమ్మలమడుగు, బద్వేలు, అనంతపురం జిల్లాలోని కదిరి, తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట, ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, అద్దంకి, ఎర్రగొండపాలెం, విశాఖపట్నం జిల్లాలోని పాడేరు లో ఫిరాయింపులకు టిడిపి నేతల మధ్య పరిస్ధితి మరింత ఘోరంగా తయారైంది. వీరి మధ్య ఆధిపత్య పోరాటాలతో చివరకు ఎన్నికల్లో పార్టీ పుట్టిముణిగే పరిస్ధితికి చేరుకుంది. పై నియోజకవర్గాల్లోని గొడవల ప్రభావం ఆ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమవ్వక, పక్క నియోజకవర్గాలపైన కూడా ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువున్నాయని పార్టీ నేతలు ఆందోళన పడుతున్నారు. అసలే ప్రజా వ్యతిరేకత, ఆపైన శతృవులుగా మారిని మిత్రులు, బోనస్ గా పలు నియోజకర్గాల్లో ఫిరాయింపుల గోల. ఈ సమస్యలతో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పరిస్ధితి ఎలాగుంటుందో చూడాల్సిందే.