దెందులూరు నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలోనే పూర్తిస్థాయిలో ప్రత్యేకతను సంతరించుకున్న నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉండడంతోపాటు అన్ని విధాలా కూడా ఆయన ఫైర్ బ్రాండ్ అని పేరు తెచ్చుకోవడంతో ఆయనకు ఇక్కడ ప్రజలు ఫిదా అవుతున్నారు. అదేసమయంలో పార్టీ కేడర్ కూడా చాలా బలంగానే ఉండడం గమనార్హం. కానీ, ఇక్కడి విపక్షం వైసీపీ మాత్రం చింతమనేని లూప్ హోల్స్ను టార్గెట్ చేస్తోంది. 2014లో ఎన్నికైన నాటి నుంచి ఆయన నియోజకవర్గానికి చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే చెప్పాలంటూ వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ఎంతసేపూ వివాదాలు, విధ్వంసాలూ తప్ప చింతమనేని సాధించింది ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇసుక పథకాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని తహసిల్దార్ వనజాక్షిని కొట్టించాడంటూ ప్రచారం కూడా చేస్తున్నారు. ఇలా వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలవాలని భావిస్తున్న వైసీపీ .. వివిధ రూపాల్లో చింతమనేనికి ఎర్త్ పెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలకు సంబంధించి చింతమనేనికి దీటైన వ్యక్తిని ఇక్కడ నిలబెట్టాలని జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తొలుత ఇక్కడ వైసీపీకి అన్నీతానై వ్యవహరిస్తున్న కొఠారు రామచంద్రరావును బరిలోకి దింపాలని భావించారు.
అయితే, గత ఎన్నికల ఫలితం సహా పార్టీ అంతర్గత సర్వేలో వచ్చిన రిజల్ట్ ఆధారంగా ఆయనను వద్దని నిర్ణయించుకున్నట్టు సమాచారం. నిజానికి రామచంద్ర రావు.. చింతమనేనికి సమీప బంధువు కూడా కావడంతో ఓటింగ్ ప్రభావం భారీ ఎత్తున పడుతుందని జగన్ భావించి ఉంటాడని సీనియర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్కు బలమైన ప్రత్యర్థిని రంగంలోకి దింపాలని జగన్ చేస్తున్న ప్రణాళిక మేరకు ఇక్కడ అనూహ్యంగా ఓ ఎన్నారైకి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు.
కొఠారి రామచంద్రరావు కుమారుడు, అమెరికాలో స్థిరపడిన అబ్బయ్య చౌదరిని ఇండియాకు తీసుకు వచ్చి.. దెందులూరు టికెట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం అబ్బయ్య చౌదరి అమెరికాలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు. అయితే, ఆయనను రంగంలోకి దింపడం వల్ల ఆర్థికంగా కూడా పార్టీని ఆయన ఆదుకునే అవకాశం ఉంటుందని, పైగా ఉన్నత విద్యావంతుడు కావడంతో ప్రజలకు త్వరగా చేరువ అవుతాడని కూడా జగన్ భావిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా కొత్త వ్యక్తి కావడం, అవినీతి ఆరోపణలు ఏవీ లేకపోవడంతో ప్రజలు రిసీవ్ చేసుకునే అవకాశం ఉందని కూడా జగన్ భావిస్తున్నారని అంటున్నారు సీనియర్లు.
దీంతో టీడీపీ తరఫున బలమైన వ్యక్తిగా రంగంలోకి దిగాలని చూస్తున్న చింతమనేనికి అబ్బయ్య చౌదరి సరైన సమాధానం చెబుతారని భావిస్తున్నారట. దీంతో ఈయనకే టికెట్ ఖరారుచేయాలని సీనియర్లు కూడా జగన్ కు సూచిస్తున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే.. చింతమనేనిపై తొలిసారి ఓ ఎన్నారై పోటీకి దిగే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు వైసీపీ నాయకులు. మరి జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి .