దేశ రాజకీయాల్లో తమకు తిరుగులేదని భావిస్తున్న బీజేపీ సారథి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీలకు షాకిచ్చే న్యూస్ వచ్చింది. ఇప్పటికే కర్ణాటకలో చావుదెబ్బ తిన్న బీజేపీకి మరో ఎదురు దెబ్బతగిలేలా కనిపిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పలు కారణాలతో వాయిదా పడ్డ పది స్థానాలకు ఉప ఎన్నిక జరగబోతోంది. ఉత్తరప్రదేశ్లోని కైరానా, మహారాష్ట్ర లోని పాల్గార్, భండారా-గోండియా, నాగాలాండ్ లోక్సభ నియోజకర్గాలకు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బిహార్, కేరళ, మహా రాష్ట్ర, మేఘాలయ, ఉత్తరాఖండ్, బెంగాల్లలో ఒక్కో శాసనసభ స్థానానికి, జార్ఖండ్లో రెండు శాసనసభ స్థానాలకు ఎన్ని కలు జరగనున్నాయి.
కర్ణాటకలో విజయం ముంగిట బొక్కబోర్లా పడ్డ బీజేపీ తాజా ఉప ఎన్నికల్లో సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే, అది అంత ఈజీ కాదని అంటున్నారు పరిశీలకులు. యూపీలో గత మార్చిలో బీజేపీ కంచుకోటల్లాంటి రెండు లోక్సభ స్థానాల ఉప ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ చేతిలో బీజేపీ చిత్తయింది. సమాజ్వాదీకి బీఎస్పీ మద్దతుగా నిలవడం వల్లే ఈ విజయం సాధ్యమైంది. రెండు పార్టీల మధ్య 2019 ఎన్నికల్లోనూ పొత్తు ఉండబోతోందని సంకేతాలు వెలువడిన నేపథ్యంలో కూటమి సక్సెస్ రేటుకు బీజేపీ సిట్టింగ్ సీటు కైరానాలో జరిగే ఉప ఎన్నికలు గీటురాయిగా మారనున్నాయి.
మహారాష్ట్రలోని రెండు సిట్టింగ్ సీట్లలోనూ బీజేపీ కష్టాల్లో ఉంది. భండారా-గోండియా ఎంపీ పాటొలే ఏకంగా పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి కాంగ్రె్సలో చేరారు. పాల్గార్లో ఎంపీ చనిపోతే ఆయన కుటుంబ సభ్యులు శివసేనలో చేరారు. మహారాష్ట్రలో ఉప ఎన్నికలు జరుగుతున్న ఏకైక శాసనసభ సీటులో కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పరిణామాలు మోడీ, షా ద్వయానికి ఎదురు దెబ్బ తగిలినట్టుగానే పరిగణిస్తున్నారు. తాజా ఉప ఎన్నికల్లో మళ్లీ అదే సీన్ రిపీట్ అయితే మాత్రం మోడీ, షాలకు ఇబ్బంది పరిణామాలు తప్పవని అంటున్నారు పరిశీలకులు.
మరో ఏడాదిలోనే ఎన్నికలు ఉండడం, దేశంలో ప్రాంతీయ పార్టీలు ఈ ద్వయానికి వ్యతిరేకంగా చక్రం తిప్పాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికలు మరింత కష్టంగా మారనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు తమకు పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని నిరూపించుకోవాల్సిన అవసరం మోడీ, షాలపై ఎంతైనా ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఒకేసారి జరుగుతున్న ఈ ఉప ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల మీదా.. మోడీ పాలనకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ గా పని చేస్తాయంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.