పోయిన ఎన్నికల్లో వైసిపిని బాగా దెబ్బ తీసిన జిల్లాల్లో పశ్చిమగోదావరి జిల్లా కూడా ఒకటి. ఎలాగంటే, జిల్లాల్లోని 15 నియోజకవర్గాల్లో ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో కూడా వైసిపి అభ్యర్ధి గెలవలేదు. రాష్ట్రం మొత్తం మీద వైసిపికి ఒక్క నియోజకవర్గం కూడా దక్కని జిల్లాగా పశ్చిమగోదావరి రికార్డు సృష్టించింది. అదే సమయంలో పొత్తులతో పోటీ చేసిన టిడిపి, బిజెపిలకు ఈ జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 15 నియోజకవర్గాల్లో బిజెపి ఒక్క నియోజకవర్గంలో గెలవగా మిగిలిన 14 నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశంపార్టీ అభ్యర్ధులే గెలిచారు. పోయిన ఎన్నికల్లో ఏకపక్షంగా టిడిపికి అన్ని సీట్లు రావటానికి అనేక అంశాలు కలసివచ్చాయి. అంతా బాగానే ఉందికానీ మరి వచ్చే ఎన్నికల మాటేంటి ? ఇపుడిదే ప్రశ్న జనాలందరి బుర్రలను తొలిచేస్తోంది. ఎందుకంటే, ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సానుకూలంగా కనిపిస్తున్న జనాల స్పందనతో అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి.
చంద్రబాబుకు వ్యతిరేక పవనాలు ?
మారిన రాజకీయ పరిస్ధితుల్లో చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై జనాల్లో అన్ని చోట్లా వ్యతిరేకత పెరిగినట్లే ఈ జిల్లాలో కూడా జనాలు మండిపోతున్నారు. పోయిన ఎన్నికల్లో సిఎం అవ్వటమే లక్ష్యంగా ఆచరణ సాధ్యం కానీ అనేక హామీలిచ్చారు చంద్రబాబు. ముఖ్యమంత్రైపోగానే సహజంగానే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేశారు. చంద్రబాబు ఇచ్చిన అనేక హామీల్లో కాపులను బిసిల్లో చేర్చటం, రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి లాంటివి కీలకమైనవి. రాష్ట్రమంతా ఎలాగున్నా ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజికవర్గందే పై చేయి. కాపులను బిసిల్లో చేర్చటమనే హామీని చంద్రబాబు తుంగలో తొక్కటంతో కాపులు మండిపోతున్నారు. పైగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేసి నానా యాతనలకు గురిచేస్తోంది. రిజర్వేషన్ల అంశానికి తోడు రుణమాఫీ కాకపోవటం, ఉద్యోగాలు రాకపోవటమే కాకుండా నిరుద్యోగ భృతి కూడా అమలు కాకపోవటం లాంటి అంశాల వల్ల చంద్రబాబుపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయి జగన్ పాదయాత్రలో పాల్గొంటున్నారు.
బిజెపి, జనసేన విడిపోయిన ప్రభావం
టిడిపితో బిజెపి, జనసేన పార్టీలు విడిపోయిన ప్రభావం కూడా వచ్చే ఎన్నికల్లో స్పష్టంగా కనబడుతుందనే ప్రచారం బాగా జరుగుతోంది. పోయిన ఎన్నికల్లో టిడిపిని జనాలు ఆధరించారంటే అందుకు బిజెపి, పవన్ కల్యాణ్ తో పొత్తులు కూడా కలిసి వచ్చాయి. దేశవ్యాప్తంగా నరేంద్రమోడిపై ఉన్న క్రేజ్, పవన్ మద్దతుతో చంద్రబాబు ఎన్నికల పరీక్షలో ఏదోలా గట్టెక్కారు. ఇద్దరు మిత్రులు పక్కనున్నా, ఆచరణకాని అన్ని హామీలిచ్చినా వైసిపికి కూటమికి మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 5 లక్షలు మాత్రమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదే గనుక మిత్రుల్లో ఒక్కరు లేకపోయినా లేక చంద్రబాబు హామీలను జనాలు నమ్మకపోయినా ఫలితం వేరే రకంగా ఉండేదనటంలో సందేహమే లేదు. ఒకసారి చంద్రబాబు హామీలను నమ్మ దెబ్బతిన్న జనాలు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబును నమ్ముతారా అన్నది ప్రశ్న. అదే సమయంలో జనసేన, బిజెపిలుల వేటికవే పోటీ చేయటానికి రెడీ అవుతున్నాయి. అంటే పోయిన ఎన్నికల్లో చంద్రబాబుకు అనుకూలించిన అంశాలేవీ వచ్చే ఎన్నికల్లో కనబడే అవకాశాలు లేనట్లే.
జగన్ కు పెరుగుతున్న ఆధరణ
పాదయాత్ర జరిగిన జిల్లాల్లో లాగే ఈ జిల్లాలో కూడా జగన్ కు జనాధరణ బాగా కనిపిస్తోంది. కృష్ణా జిల్లాలో నుండి పశ్చిమలోకి ప్రవేశించిన జగన్ దెందులూరు, ఏలూరు, తాడేపల్లిగూడెం, ఉండి, భీమవరం నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేశారు. ప్రతీ నియోజకవర్గంలోనూ జనాధరణ అంతకంతకూ పెరుగుతోంది. దాంతో వచ్చే ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసిపి జెండా ఎగరటం ఖాయమన్న ప్రచారం మొదలైంది. కాకపోతే పోయిన ఎన్నికల్లో చేసిన తప్పులను జగన్ పునరావృతం కాకుండా చూసుకుంటే చాలు. టిక్కెట్లు చివరి నిముషం వరకు ఖరారు చేయకపోవటం, చివరి నిముషంలో కొందరు అభ్యర్ధులను మార్చేయటం లాంటి తప్పుల వల్ల కొన్ని సీట్లు పోవటం జగన్ స్వయంకృతమనే చెప్పక తప్పదు.
టిడిపిలో అసంతృప్తులు
ఇదిలావుంటే, టిడిపిలో అంతర్గత విభేదాలు తీవ్రస్ధాయికి చేరుకున్నాయ్. దాదాపు ప్రతీ నియోజకవర్గంలోనూ ఎంఎల్ఏలు-నేతలకు పడటం లేదు. మరికొన్ని నియోజవకర్గాల్లో ఎంపి-ఎంఎంల్ఏలకు పడటం లేదు. హోలు మొత్తం మీద టిడిపి ప్రజాప్రతినిధులపై జనాల్లో వ్యతిరేకత బాగా పెరిగిపోయిందన్నది వాస్తవం. జగన్ ప్రభావం కాకపోయినా అంతర్గత సమస్యల వల్ల కూడా వచ్చే ఎన్నికల్లో టిడిపి కొన్ని సీట్లు కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయ్. అదే సమయంలో పోయిన ఎన్నికల్లో జగన్ చేసిన తప్పుల వల్ల కనీసం మూడు సీట్లు తక్కువ తేడాతో వైసిపి కోల్పోయింది. నిడదవోలు, ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల్లో వైసిపి అభ్యర్ధులు 6359, 3920, 6383 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇవికాకుండా కొవ్వూరు, భీమవరం, గోపాలపురం నియోజకవర్గాల్లో అభ్యర్ధులు జాగ్రత్త పడుంటే గెలిచే అవకాశాలుండేవి. కాబట్టి పై నియోజకవర్గాలపై జగన్ దృష్టిపెడితే గెలుపు అవకాశాలు ఎక్కువున్నాయని ప్రచారం జరుగుతోంది.