రాజకీయాల్లో ఏదైనా చేయొచ్చు.. కానీ, మబ్బుల్లో నీళ్లు చూసుకుని ఉన్నవి పారబోసుకుంటే మాత్రం.. ఏ ఒక్కరూ కాపాడలేరు. ఇప్పుడు ఇదే పరిణామం.. ఏపీ బీజేపీలోనూ ఎదురు కానుందని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని, ఎవరితోనూ తమకు పొత్తు అక్కరలేదని బీజేపీ జాతీయ సారథి అమిత్ షా స్వయంగా వెల్లడించిన నేపథ్యంలో ఏపీలో బీజేపీకి ఉన్న సీనెంత? వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగితే.. పరిస్థితి ఏంటి? అనే కీలక అంశాలపై చర్చ సాగుతోంది. ప్రస్తుతం..ఏపీలో బీజేపీ పరిస్థితి.. గతంలో కన్నా దారుణంగా ఉంది. ఇటీవల కాలంలో చంద్రబాబు.. చేసిన యాంటీ ప్రచారం బాగా వర్కవుట్ అయింది. దీంతో.. ఏపీలో ఒంటరిగా బరిలోకి దిగితే అభ్యర్థులను అమిత్ షా అరువు తెచ్చుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.
ఇటీవల లోక్నీతి-సీఎస్డీఎస్ మూడ్ ఆఫ్ది నేషన్ పేరుతో నిర్వహించిన సర్వే వెల్లడించిన విషయాలు దక్షిణాదిన కమలం పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెబుతున్నాయి. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే దక్షిణాదిలో ఉన్న 132సీట్లలో ఆ పార్టీ కేవలం 18-నుంచి 22 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని సర్వేలో పేర్కొంది. ఇదే సమయంలో ఎన్డీయే నుంచి చంద్రబాబు బయటకు రావడం వల్లే మోడీ ప్రభ తగ్గిపోయిందనీ, ఏపీలో టీడీపీ బాగా పుంజుకుందనీ ఈ సర్వే వివరాలు చెప్పడం గమనార్హం. ఏపీలో కమలం పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. సరైన నాయకత్వం లేక సతమతమవుతోంది.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను నియమించడంతో ఎంతటి దుమారం రేగిందో అందరికీ తెలిసిందే. అంతేగాకుండా తెలంగాణలోనూ ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. కొద్దిరోజులుగా బీజేపీ నేతలు తమ మాటలతీరుతో పార్టీకి మరింత నష్టం చేస్తున్నారనే భావన శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల కంటే ముందు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ చేసిన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. మే 15తర్వాత ఏపీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయనీ, వీటన్నింటికీ సిద్ధంగా ఉండాలని జీవీఎల్ పరోక్షంగా టీడీపీని బెదిరిస్తూ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి నష్టమే జరిగిందని కమలం శ్రేణులు గుర్రుగా ఉన్నాయి.
అటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ నమ్మకద్రోహం చేసిందనే ఆగ్రహం ఆంధ్రుల్లో రోజురోజుకూ పెరుగు తోంది. మరోవైపు పార్టీలో గ్రూపుతగాదాలూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి గెలుస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా చెప్పడం హాస్యాస్పదమని పలువురు నాయకులు అంటున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి న కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటి వరకు విధుల్లోకిదిగలేదు. ఆయన విధుల్లోకి దిగి.. జిల్లాల వారీలోపాలను గుర్తించి.. వాటిని సరిచేయడం, నాయకులను రంగంలోకి దింపడం.. గెలుపు గుర్రం ఎక్కించడం అనేవి కలలో కూడా జరిగేలా కనిపించడం లేదని అంటున్నారు విమర్శకులు