ఆనవాయితీగా నిర్వహిస్తున్న తెలుగుదేశంపార్టీ మహానాడు ఎందుకు నిర్వహిస్తున్నారో కూడా అర్ధం కావటం లేదు. ఒకప్పటి సంగతి ఏమోగానీ ఈమధ్య కాలంలో మాత్రం ప్రతిపక్షాలను తిట్టటానికి, తనను తాను పొగుడుకోవటానికే అన్నట్లుగా జరుగుతోంది. మంగళవారంతో ముగిసిన మూడు రోజుల విజయవాడ మహానాడులో కూడా జరిగిందదే. కాకపోతే పోయిన మహానాడు వరకూ ఒక్క వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని మాత్రమే తిట్టేవారు. ఇపుడు జగన్ కు తోడు బిజెపిని కూడా కలిపి తిట్టారు అంతే తేడా.
చంద్రబాబు బ్రహ్మాండం-జగన్ అవినీతి పరుడు
మహానాడులో ఎంతమంది నేతలు మాట్లడినా, చివరకు చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడినా ఒకటే రొడ్డకొట్టుడు. అదేమిటంటే చంద్రబాబు బ్రహ్మాండం, జగన్ ఎందుకు పనికిరాడు, అవినీతిపరుడు. మూడు రోజుల మహనాడు వక్తల ప్రసంగాల్లో వినిపించింది మాత్రం అదే. మామూలుగా అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ఏం చేస్తుంది. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత జనాలకు ఏం చేసిందో చెప్పుకుంటుంది. మిగిలిన పదవీ కాలంలో ఏమి చేయబోతోందో వివరిస్తుంది. మళ్ళీ అదికారంలోకి వస్తే ఏం చేయబోతున్నదో చెబుతుంది. కానీ టిడిపిదంతా రివర్స్ సీన్ కదా ? అందుకే జగన్, బిజెపిలను కలిపి తిట్టిపోసింది.
పొగిడిన నోటితోనే తిడుతున్న చంద్రబాబు
పోయిన ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేసింది టిడిపినే. నాలుగేళ్ళు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారాలను కలిసి పంచుకున్నది చంద్రబాబే. ఎన్డీఏలో కలిసి ఉన్నంత వరకూ మోడిని, కేంద్రాన్ని బ్రహ్మాండమంటూ పొగిడింది, మంత్రివర్గం, అసెంబ్లీల్లో తీర్మానాలు చేసింది కూడా ఇదే చంద్రబాబు. కానీ ఎప్పుడైతే ప్రధానమంత్రితో చెడిందో ఎన్డీలో నుండి బయటకు వచ్చేశారో, అప్పటి నుండి మోడిని, కేంద్రాన్ని తిడుతున్నది కూడా చంద్రబాబు, టిడిపినే. నాలుగేళ్ళు పొగిడిన నోటితోనే తిట్టటానికి, నాలుగేళ్ళు వద్దన్న ప్రత్యేకహోదానే ఎన్నికల చివరి సంవత్సరంలో కావాలను కోవటానికి చంద్రబాబు ఏమాత్రం సిగ్గుపడటం లేదు. అందుకే, మహానాడులో జగన్, మోడిని అంతలా తిట్టింది. ఎప్పుడైతే చంద్రబాబు తిట్టటం మొదలుపెట్టారో వెంటనే నేతలు క్యూ కట్టారు.
మహానాడు మొత్తం జగన్ నామస్మరణే
మూడు రోజుల మహానాడులో చంద్రబాబు ఎక్కువగా ప్రస్తావించిన పేరు జగన్మోహన్ రెడ్డిదేనట. మొత్తం మూడు ఓజుల మహానాడులో జగన్ పేరును చంద్రబాబు 507 సార్లు ప్రస్తావించారట. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరును 212 సార్లు వైసిపి పేరును 78 సార్లు, సాక్షి మీడియా పేరును 18 సార్లు ప్రస్తావించారట. అదే సమయంలో ఎన్టీఆర్ పేరును 83 సార్లు, టిడిడి పేరును 161 సార్లు, నేతలు చంద్రబాబు పేరును ప్రస్తావించింది 117 సార్లట. దీన్ని బట్టే తెలుస్తోంది టిడిపి మహానాడును జరుపుకుంది ఎవరి కోసమో ?