అవును! రాష్ట్రంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. గత నెల రోజులకు పైగా ఏపీ సీఎం చంద్రబాబు పాలనను పక్కన పెట్టి మరీ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదని, కేంద్రం మోసం చేసిందని, బీజేపీ రాష్ట్ర ద్రోహి అని ప్రచారం చేస్తున్నారు. గత నెల 20న తన పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలో ధర్మ పోరాట దీక్ష పేరుతో ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు చంద్రబాబు వినూత్న దీక్ష చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులను విజయవాడకు తరలించారు.
మొత్తంగా ఈ కార్యక్రమానికి దాదాపు 36 లక్షల వరకు ఖర్చయినట్టు తేలింది. ఆ తర్వాత తిరుపతిలోను, విశాఖలోను ధర్మ పోరాట దీక్ష సభలను నిర్వహించారు. వీటికి కూడా భారీ ఎత్తున రూ.50 లక్షలకు పైగానే ఖర్చు పెట్టారు. మరి ఈ డబ్బంతా ఎక్కడిది? అంటే.. వీటిని ప్రభుత్వం తరఫున అధికారికంగా చేసిన కార్యక్రమాలు కాబట్టి.. రాష్ట్ర ఖజానా నుంచి ఈ సొమ్మును ఖర్చు చేశారని తేలింది. మరి మొత్తం రూ.కోటి ఖర్చు చేస్తే.. వచ్చిన ప్రయోజనం ఏంటి? అంటే.,. చంద్రబాబుపై మచ్చ పడకుండా చేసుకోవడమేనని తేలింది.
ఎన్నికల ప్రచారానికి దీటుగా ఈ సభల్లోచంద్రబాబు అటు బీజేపీ, ఇటు వైసీపీ, మొత్తంగా పవన్ పార్టీలను కలిపి ఉతికి ఆరేశారు. దీంతో గత నాలుగేళ్లుగా అధికారంలో ఉండి కూడా ప్రత్యేక హోదా సాధించలేదనే అపవాదు నుంచి తనను తాను రక్షించుకునేందుకు బాబు వ్యూహాత్మకంగా అడుగులు వేశాడు. దీనికి ప్రజల సొమ్మునే వినియోగించుకున్నారు. ఇక, రెండు రోజుల్లో చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు నవ నిర్మాణ దీక్షలు నిర్వహిస్తున్నాడు.
వారం రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వీటిని నిర్వహించనున్నారు. వీటి ఖర్చు మాత్రం ప్రజల మీదే పడుతోంది. ఏకంగా 14 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ దీక్షలను నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ దీక్షలు తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమాల్లా సాగుతాయని వేరే చెప్పనక్కర్లేదు. తన రాజకీయ ప్రచారం కోసం.. తన సొంత గొప్పలు చెప్పుకోవడానికి, బీజేపీ, వైసీపీల మీద విరుచుకుపడటానికి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాలను ఉపయోగించుకోనున్నాడు. అయితే ఖర్చు మాత్రం ప్రజల చేతుల నుంచి పెట్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరి దీనిపై టీడీపీ నేతలు ఏమంటారో చూడాలి.