ప్రజాధనాన్ని అయినవారికి విచ్చల విడిగా దోచిపెట్టటంలో తనకు మించినోడు లేడని చంద్రబాబునాయుడు ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందని, జరుగుతోందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నా చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. పట్టిసీమలో రూ. 400 కోట్ల అవినీతి జరిగిందని స్వయంగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఎత్తిచూపినా ఖాతరు చేయలేదు. అటువంటిది తాజాగా పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ కు రోజువారీ ఖర్చుల క్రింద రూ. 10 కోట్లు విడుదల చేయాలంటూ చంద్రబాబు ఆదేశించటం సంచలనంగా మారింది.
పనుల కన్నా వివాదాలే ఎక్కువ
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పోలవరం ప్రాజెక్టులో జరిగిన పనుల కన్నా రేగిన వివాదాలే ఎక్కువ. ఎందుకంటే, రూ. 16 వేల కోట్ల వ్యయాన్ని ఇప్పటికి సుమారు రూ 50 వేల కోట్లకు పెంచుకుంటూ పోయారు. విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వానిదే. అయితే, పట్టుపట్టి మరీ చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణాన్ని చంద్రబాబు తన చేతుల్లోకి లాక్కున్నారు. పోనీ పనులన్నా సక్రమంగా జరిగాయా అంటే అదీ లేదు. అసలు కాంట్రాక్ట్ సంస్ధకు అంతటి భారీ ప్రాజెక్టులను నిర్మించే ఆర్దిక స్ధోమత లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అయినా చంద్రబాబు అదే సంస్ధను కొనసాగించారు. ఎందుకంటే, సదరు కాంట్రాక్ట్ సంస్ధ టిడిపి నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావుదే అన్న సంగతి అందరికీ తెలిసిందే.
ట్రాన్స్ ట్రాయ్ పై ఎందుకంత ప్రేమ ?
ఎప్పుడైతే స్వయంగా చంద్రబాబు దన్నే దక్కిందో అప్పటి నుండి సంస్ధ యాజమాన్యానికి ఆడింది ఆట పాడిందే పాటగా సాగుతోంది. ప్రాజెక్టు పనులు పూర్తి చేయదు. ఇంకోరిని చేయనివ్వదు. డబ్బులు మాత్రం ఖర్చయిపోతోంది. చివరకు ఎన్నికలు దగ్గరకు వస్తోందన్న కారణంతో చంద్రబాబే సంస్ధపై ఆగ్రహం వ్యక్తం చేయటం మొదలుపెట్టారు. దాంతో నవయుగ సంస్దకు పనులు అప్పగించేందుకు మంత్రివర్గంలో నిర్ణయమైంది. దాంతో నవయుగ సంస్ద పనులు కూడా మొదలుపెట్టింది.
వివాదాస్పదమైన జీవో
ఇదిలావుంటే, పనులు చేస్తున్నది నవయుగ సంస్ధ అయితే తాజాగా ట్రాన్స్ ట్రాయ్ కు చేతి ఖర్చుల క్రింద రూ. 10 కోట్లు ఇవ్వనున్నట్లు జలవనరుల శాఖ జీవో విడుదల చేయటం విచిత్రంగా ఉంది. ఇప్పటి వరకూ సంస్ధకు ప్రభుత్వం రూ. 160 కోట్లు చెల్లించిందట. చేతి ఖర్చులంటే ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. అంత మొత్తం సంస్ధ దేనికి ఖర్చు పెడుతుందో తెలీదు. ఇంతకీ విషయం ఏమిటంటే అసలు ప్రాజెక్టు పనులనే సక్రమంగా చేయలేని సంస్ధకు ప్రభుత్వం చేతి ఖర్చుల క్రింద రూ. 10 కోట్లు చెల్లించటం ఏంటో ఎవరికీ అర్ధం కావటం లేదు.