తమిళనాడు లో వారం రోజులుగా తూత్తుకుడి అంశం అట్టుడికిపోతుంది. తమకు న్యాయం చేయమని అడిగిన బాధితులపై కాల్పులు జరపడం పెను సంచలనంగా మారిపోయింది. తూత్తుకుడి కాల్పుల ఘటన తమిళనాడు అసెంబ్లీని కుదిపేసింది. స్టెరిలైట్ కర్మాగారాన్ని మూసివేయాలంటూ కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్న సమయంలో కాల్పులు జరపడంపై ప్రతిపక్షాలు అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నారు. ఇదే విషయంపై నటులు రజినీకాంత్, కమల్ హాసన్ కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు.
కాగా, తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ వద్దంటూ జరిగిన నిరసనల్లో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఓ యువకుడు పెద్ద షాక్ ఇచ్చాడు. తూత్తుకుడి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (టీఎంసీహెచ్)కి రజనీకాంత్ రాగా, ఓ యువకుడు రజనీని చూసి 'మీరు ఎవరు?' అని ప్రశ్నించడంతో ఆయన సహా అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. తూత్తుకుడి ఘటనపై నిరసనగా కలెక్టర్ ముట్టడి కార్యక్రమంలో ఆ యువకుడు చురుగ్గా పాల్గొన్నట్లు తెలుస్తుంది.
కె.సంతోష్ రాజ్ అనే 21 సంవత్సరాల బీకామ్ గ్రాడ్యుయేట్ ఈ ప్రశ్న వేశాడు. ఆల్ కాలేజ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ను స్థాపించి, స్టెరిలైట్ కు వ్యతిరేకంగా ఉద్యమం మరింత ఉద్ధృతంగా మారేందుకు కృషి చేశాడు. ఈ నెల 22వ తేదీన కలెక్టరేట్ ముట్డడికి సంతోష్ రాజ్ నేతృత్వంలోని విద్యార్థుల సమూహంగా వచ్చి నిరసనలు తెలిపారు. ఆ సమయంలో వారిపై లాఠీ చార్జీ జరగడంతో సంతోష్ రాజ్ కి తలకు తీవ్ర గాయం అయ్యింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అయితే ఆసుపత్రిలో ఉన్నవారిని కొంత మంది వీఐపీలు వస్తున్న నేపథ్యంలో వారందరికీ నిరసనగా సంతోష్ రాజ్ ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారని స్థానికులు తెలిపారు. అయితే నిన్న రజినీకాంత్ తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ వద్దంటూ జరిగిన నిరసనల్లో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఆ యువకుడు 'మీరు ఎవరు?' అన్న ప్రశ్నకు రజనీకాంత్ చిరునవ్వే సమాధానంగా ముందుకు కదిలారని తెలుస్తోంది.