ఏమిటో భారతీయ జనతా పార్టీ నేతల మాటలు చూస్తుంటే విచిత్రంగా ఉంటోంది. రాష్ట్రంలో బిజెపిది బలమో లేకపోతే వాపో కూడా ఎవరికీ అర్ధం కావటం లేదు. అటువంటిది వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వచ్చేస్తున్నట్లు కలలు గంటున్నారు. పైగా ముఖ్యమంత్రి అభ్యర్ధులు ఎవరో కూడా నిర్ణయించేసుకుంటున్నారంటేనే ఆశ్చర్యంగా ఉంది. తిరుమల పర్యటనలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాటలు చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో కూడా అర్ధం కావటం లేదు. తిరుమల పర్యటనలో మీడియాతో కన్నా మాట్లాడుతూ, ఇద్దరు లక్ష్మీనారాయణల్లో ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్ధి అవుతారో తమ అధిష్టానమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఇద్దరు లక్ష్మీనారాయణలు ఎవరు ? అంటే ఒకరేమో రాష్ట్ర అధ్యక్షుడు. ఇంకోరెవరయ్యా అంటే సిబిఐలో జాయింట్ డైరెక్టర్ (జెడి) గా పనిచేసి రిటైర్ అయిన లక్ష్మీనారాయణ అట.
కన్నా అతి చేస్తున్నట్లు లేదా ?
ఇక్కడే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే జెడి ఉద్యోగానికి రాజీనామా చేసినమాట వాస్తవమే. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నదీ నిజమే. అంతేకానీ ఏ పార్టీలో చేరేది తెలీదు. పైగా తాను ఏ పార్టీలోనూ చేరటం లేదని స్పష్టంగా ప్రకటించారు. అయితే, జెడి త్వరలో బిజెపిలో చేరుతారనే ప్రచారమైతే బాగా జరుగుతోంది. ఒకవేళ చేరారనే అనుకుందాం? లక్ష్మీనారాయణ బిజెపిలో చేరితే ఏమవుతుంది ? పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందా ? ఒక్క లక్ష్మీనారాయణ వల్లే బిజెపి అధికారంలోకి వచ్చేస్తుందని మిగిలిన నేతలు ఎలా అనుకుంటున్నారో అర్ధం కావటం లేదు .
175 నియోజకవర్గాల్లో అభ్యర్ధులున్నారా ?
నిజానికి బిజెపికి సంస్ధాగతంగా బలమే లేదు. ఇపుడేదో బూత్ కమిటీలనీ, కర్నాటక ఫార్ములా అని అంటున్నారు. అవి ఎంత వరకూ వర్కవుటవుతాయో ఇపుడే ఎవరూ చెప్పలేరు. ఆ విషయం పక్కనపెడితే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని చాలామంది నేతలు అత్యుత్సాహం చూపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకూ అభ్యర్ధులను ప్రకటించమంటే బిజెపి చేతులెత్తేస్తుంది. ఎవరినో ఒకరిని అభ్యర్ధిగా ప్రకటించటం వేరు, గెలుస్తారని, గట్టి అభ్యర్ధులనే రంగంలోకి దింపిందని అనిపించుకోవటం వేరు. అటు అభ్యర్ధులు మొత్తం ఓ 20 నియోజకవర్గాలుంటే చాలా ఎక్కువ. అటువంటిది వచ్చే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వచ్చేస్తుందని, అందులో భాగమే సిఎం అభ్యర్ధులపై బిజెపి జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టినట్లు స్వయంగా కన్నా లక్ష్మీనారాయణే మీడియాతో చెప్పటం విచిత్రంగా ఉంది.