తన అధికారానికి ఎక్కడా ఓటమి లేదని మొన్నటి వరకు ఢంకా బజాయించి చెప్పుకొచ్చిన బీజేపీకి గత కొంత కాలంగా ఎక్కడ చూసినా ఎదురుగాలి వీస్తుంది. ఈ మద్య కర్ణాటకలో 104 సీట్లు నెగ్గినా..ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. నిన్న ఉప ఎన్నికల ఫలితాల్లో అసలు బీజేపీ ఉందా లేదా అన్న పరిస్థితి నెలకొంది. దాంతో అధికార పార్టీ సందిగ్ధంలో పడిపోయింది..తాము ఎంతో అభివృద్ది చేస్తున్నామని ప్రచారాలు చేసినా..అవి దేనికీ పనికిరాకుండా పోవడంతో బీజేపీ నేతల్లో గుబులు పుట్టుకొస్తుంది.
నిన్న ఉప ఎన్నికల ఫలితాల్లో నాలుగు లోక్సభ, పది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. నాలుగు లోక్సభ స్థానాల్లో ఒకటి బీజేపీ గెలుచుకోగా, మరో దానిని మిత్ర పక్షం గెలుచుకుంది. అలాగే, పది అసెంబ్లీ స్థానాల్లో ఒక్క దాంట్లోనే గెలుపొందింది. దీంతో కేబినెట్ భేటీలో కొందరు మంత్రులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో ఇటువంటి ఫలితాలే పునరావృతమవుతాయని మంత్రులు పేర్కొన్నారు. కాకపోతే తాజా ఫలితాలు చూసి సంబరపడటం మనకే ప్రమాదమని..మాటలు చెప్పి ప్రజలను లొంగ దీసుకోలేరని మరోసారి రుజువైందని చంద్రబాబు నాయుడు అన్నారు. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని మంత్రులను చంద్రబాబు హెచ్చరించినట్టు సమాచారం.