కొత్త ఓటు బ్యాంకు కోసం చంద్రబాబునాయుడు అవస్తలు పడుతున్నారా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని యువతపై చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా కన్నేసినట్లే కనబడుతోంది. నాలుగు సంవత్సరాల పాలనలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన సంగతిని చంద్రబాబు కూడా గమనించారు. అందుకనే ప్రత్యామ్నాయ ఓటు బ్యాంకును తయారు చేసుకోవటంలో భాగంగానే చంద్రబాబు రంగంలోకి దిగారు. యువతను ఆకట్టుకోవటంలో కొడుకు నారా లోకేష్ విఫలమైన విషయం అందరికీ తెలిసిందే. యువతను ఆకట్టుకునేందుకు గతంలో లోకేష్ కొన్ని జిల్లాల్లో పర్యటించినా పెద్దగా ఉపయోగం కనబకపోగా వికటించింది. దాంతో ఇపుడు చంద్రబాబే స్వయంగా వ్యూహం పన్నుతున్నారు. అందులో భాగంగానే నిరుద్యోగ భృతి అని, విశ్వవిద్యాలయాల్లో పర్యటనలను చంద్రబాబు హడావుడి మొదలుపెట్టారు. ఈనెల నుండి డిసెంబర్ నెల వరకూ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చంద్రబాబు పర్యటించటానికి ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించుకున్నారు. ఈ మేరకు తన పర్యటనల గురించి ఆయా విశ్వవిద్యాలయాల ఉన్నతాధికారులకు సమాచారం కూడా అందచేశారట. దాంతో చంద్రబాబు ప్లాన్ ఏమిటో అందరికీ అర్ధమైపోతోంది.
చంద్రబాబు పర్యటనలెందుకు ?
ఇంతకీ అన్నీ విశ్వవిద్యాలయాల్లో పర్యటించాలని చంద్రబాబుకు ఎందుకు అనిపించింది ? అదికూడా ఇంత హడావుడిగా ? అంటే, విశ్వవిద్యాలయాల్లోని పరిస్ధితులను తెలుసుకునేందుకట. ఎవరైనా నమ్ముతారా ? నాలుగేళ్ళుగా ఏరోజు చంద్రబాబు ఒక్క విశ్వవిద్యాలయంలో కూడా పర్యటించలేదు. ఏ సందర్భంలో కూడా విద్యార్ధులతో ముఖాముఖి మాట్లాడింది లేదు. పోనీ నిరుద్యోగులతో కూడా సమావేశం పెట్టలేదు. అటువంటిది ఇంకో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయన్న ఉద్దేశ్యంతో హడావుడి పర్యటనలు పెట్టుకున్నారంటేనే సిఎం ఉద్దేశ్యం అర్ధమైపోతోంది. పైగా వచ్చే ఎన్నికల్లో యువ ఓటర్లది చాలా కీలక పాత్రగా అందరూ భావిస్తున్నారు. యువతలో కూడా అత్యధికులు వైసిపి, జనసేనకు మద్దతుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకనే యువత మద్దతును కూడగట్టుకునేందుకు చంద్రబాబు ప్లాన్ వేస్తున్న విషయం తెలిసిపోతోంది.
నిరుద్యోగ భృతి కూడా అంతేనా ?
పోయిన ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి విషయాన్ని నాలుగేళ్ళుగా చంద్రబాబు పట్టించుకోలేదు. ఇపుడు హటాత్తుగా నిరుద్యోగ భృతి పేరుతో హడావుడి మొదలుపెట్టారు. ప్రతీ నిరుద్యోగికి నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించంటం వెనుక పెద్ద కథే ఉంది. త్వరలో అమల్లోకి రానున్న నిరుద్యోగ భృతి పథకం ద్వారా 10 లక్షల మందికి లబ్ది జరుగుతుందని అంచనా వేస్తోంది ప్రభుత్వం. అంటే 10 లక్షల మంది లబ్దిదారులను నిరుద్యోగులుగా కాకుండా కేవలం ఓటు బ్యాంకుగానే చంద్రబాబు చూస్తున్నారు. ఒక్కొక్కరికి సుమారుగా ఏడాది పాటు రూ 11 వేలు ఇవ్వటం ద్వారా ఆ 10 లక్షల ఓట్లన్నింటినీ టిడిపికి వేయించుకునేందుకు ప్లాన్ సిద్దం చేశారు. ప్రభుత్వ డబ్బుతో పార్టీకి ఓట్లు వేయించుకునే ప్రయత్నం స్పష్టంగా అర్ధమైపోతోంది. నిరుద్యోగ భృతిని ఇవ్వాలన్న చిత్తశుద్దే ఉంటే అధికారంలోకి రాగానే ఎందుకు అమలు చేయలేదు ? సరిగ్గా ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతి అని విశ్వవిద్యాలయాల్లో పర్యటనలని చంద్రబాబు ఎందుకు హడావుడి చేస్తున్నారో జనాలకు అంతమాత్రం తెలీదా ?
విద్యార్ధుల రియాక్షన్ ఎలాగుంటుందో ?
చంద్రబాబు యునివర్సిటీల్లో పర్యటిస్తారని తెలియగానే ఉన్నతాధికారుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఎందుంటే, నాలుగేళ్ళపాటు చంద్రబాబు విశ్వవిద్యాలయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. పైగా ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్, నిరుద్యోగ భృతి, చదువుల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్ధుల ఆత్మహత్యలు లాంటి అనేక అంశాలపై విశ్వవిద్యాలయాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. హోదా ఆందోళనల్లో పాల్గొన్న పలువురు విద్యార్ధులపై కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వం కేసులు కూడా పెట్టించింది. వైసిపి అధ్యక్షుడు నిర్వహించిన ఆందోళనల కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్ధుల్లో అనేకమందికి కళాశాలల యాజమాన్యాలు టిసిలు ఇచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ విద్యార్ధులెవరు మరచిపోలేరు. అటువంటి నేపధ్యంలో చంద్రబాబు విశ్వవిద్యాలయాల్లో పర్యటించినపుడు విద్యార్ధులెలా రియాక్టవుతారో ఉన్నతాధికారులు అంచనా వేయలేకున్నారు. అందుకనే వారిలో ఆందోళన మొదలైంది.