వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రూపంలో గండం పొంచి ఉందా ? అందరిలోనూ ఇపుడదే అనుమానం మొదలైంది. తెలంగాణాలో బహిష్కృత టిడిపి నేత మోత్కుపల్లి నరసింహులుతో ముద్రగడ శుక్రవారం భేటీ తర్వాత అందరిలోనూ అనుమానం ఊపందుకుంది. వారిద్దరి భేటీలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా చేతులు కలపాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా త్వరలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మోత్కుపల్లి ఏపిలో పర్యటించాలని కూడా నిర్ణయమైంది. మోత్కుపల్లి పర్యటనలకు ముద్రగడ అవసరమైన సాయం చేస్తానని హామీ కూడా ఇచ్చారు. దాంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా పాత శతృవు ముద్రగడతో కొత్త శతృవు మోత్కుపల్లి చేతులు కలిపారన్న విషయం అర్ధమైపోతోంది.
చంద్రబాబుపై కత్తి కట్టిన ముద్రగడ
కాపు ఉద్యమ నేత ముద్రగడ ఎప్పటి నుండో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పోయిన ఎన్నికల్లో అధికారం అందుకోవటమే ఏకైక లక్ష్యంతో ఆచరణ సాధ్యం కానీ అనేక హామీలిచ్చారు. అందులో కాపులను బిసిల్లో చేర్చటం కూడా ఒకటి. అధికారంలోకి వచ్చిన తర్వాత తన సహజ లక్షణం ప్రకారమే చాలా హామీలను అటకెక్కించేశారు. అందులో కాపులను బిసిల్లో చేర్చటం కూడా ఉంది. చంద్రబాబు తన హామీని నెరవేర్చే ఉద్దేశ్యంలో లేరన్న విషయం అర్ధమైన తర్వాత కాపు ఉద్యమ నేత ముద్రగడ ఉద్యమం మొదలుపెట్టారు. చివరకు ఆ ఉద్యమం తీవ్ర రూపం దాల్సి చివరకు రైలును తగలపెట్టేంత దాకా వెళ్ళింది. రైలు దహనం ఘటనపై ఉభయగోదావరి జిల్లాలకు చెందిన అనేకమంది కాపులపై ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్టులు కూడా చేయించింది. తర్వాత ముద్రగడ ఎన్నిసార్లు యాత్రలు చేయాలనుకున్నా ప్రభుత్వం అనుమతించలేదు. అప్పటి నుండి ముద్రగడతో పాటు కాపులు చంద్రబాబుపై కత్తికట్టారు.
చంద్రబాబుకు వ్యతిరేకమవుతున్న బిసిలు
ఎప్పుడైతే కాపులను బిసిల్లో చేర్చుతున్నట్లు చంద్రబాబు హామీ ఇచ్చారో అప్పటి నుండి బిసిలు మండుతున్నారు. కాపులను బిసిల్లో చేర్చకూడదంటూ చంద్రబాబుకు వ్యతిరేకంగా బిసిలు ఆందోళన చేశారు. కాపులను బిసిల్లో చేర్చటం వల్ల తమకు నష్టం జరుగుతుందన్నది బిసి నేతల వాదన. అయినా సరే, కాపులను బిసిల్లో చేరుస్తూ చంద్రబాబు మంత్రివర్గంలో తీర్మానం చేయించటంతో పాటు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేయించి కేంద్రానికి పంపారు. దాంతో బిసి నేతలు కూడా చంద్రబాబుపై మండిపోతున్నారు.
చంద్రబాబుపై బోయల్లోనూ వ్యతిరేకతే
చంద్రబాబుపై బోయల్లో కూడా వ్యతిరేకత పెరుగుతోంది. ప్రస్తుతం బోయలు బిసి క్యాటగిరిలో ఉన్నారు. అయితే, తమను ఎస్టీల్లో చేర్చాలంటూ వారు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. అందుకని కాపులకు ఇచ్చినట్లే బోయలకు కూడా చంద్రబాబు పోయిన ఎన్నికల్లో ఓ హామీ పడేశారు. తనకు మద్దతిస్తే టిడిపి అధికారంలోకి రాగానే బోయలను ఎస్టీల్లో చేరుస్తానంటూ చెప్పారు. దాంతో చంద్రబాబు హామీని నిమ్మిన బోయలు పోయిన ఎన్నికల్లో టిడిపికి మద్దతిచ్చారు. అయితే, అధికారంలోకి రాగానే తన హామీనీ గాలికొదిలేశారు. కాపుల్లాగ బోయలు రోడ్లపైకి రాలేదు కానీ చంద్రబాబుపై మండిపోతున్నది మాత్రం వాస్తవం. దానికితోడు ఎస్సీల్లో మాల-మాదిగ వర్గీకరణ చిచ్చు ఎలాగూ ఎప్పటి నుండో మండుతోంది. ఈ విషయంపైనే మోత్కుపల్లి చంద్రబాబుపై మండిపోతున్నారు. చూడబోతే వచ్చే ఎన్నికల్లో చాలా సామాజికవర్గాలు చంద్రబాబుపై కత్తి కట్టేలాగున్నాయి. అందుకు ముద్రగడ పద్మనాభం కీలక పాత్ర పోషించబోతున్నారనటంలో సందేహం లేదు.