లగడపాటి రాజగోపాల్ పేరు వింటే చాలు కచ్చితమైన సర్వేలు గుర్తుకొస్తాయి. అంతేకాదు.. రాష్ట్ర విభజన సమయంలో పెప్పర్ స్ప్రేతో ఆయన చేసిన హడావుడి అంతాఇంతా కాదు. అదిప్పుడు మరుగున పడిపోయిన విషయం. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు దగ్గర పడ్తున్నాయి. ఆయన అక్కడక్కడా దర్శనమిస్తూ ఉత్కంఠ కలిగిస్తున్నారు. తాజాగా చంద్రబాబుతో భేటీ అయిన లగడపాటి సుదీర్ఘ మంతనాలు జరిపారు.
లగడపాటి రాజగోపాల్ ఏపీ సీఎం చంద్రబాబుతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అమరావతిలోని సచివాలయంలో చంద్రబాబును కలిసిన ఆయన సుమారు అరగంట సేపు ఏకాంతంగా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారనేదానిపై క్లారిటీ రాలేదు. కానీ కచ్చితంగా రాజకీయాలపైనే వారిద్దరి మధ్య చర్చలు జరిగాయని సమచారం. గతంలో కూడా లగడపాటి .. చంద్రబాబును ఏకాంతంగా కలిసిన సందర్భాలున్నాయి. సమావేశం అనంతరం బయటకు వచ్చిన తర్వాత లగడపాటి.. తాను రాజకీయాల్లో లేనని చెప్పుకొచ్చారు. వ్యక్తిగత పనిమీదే సీఎంను కలిసినట్లు చెప్పారు. అయితే ఈసారి భేటీ అయిన తర్వాత లగడపాటి మీడియాతో పిచ్చాపాటీ మాట్లాడారు. చంద్రబాబు పాలనకు కితాబిచ్చారు. సీఎంతో ఏం మాట్లాడారనేదానిపై లగడపాటి ఎక్కడా వెల్లడించలేదు.. పూర్తిగా రాజకీయ అంశాలపైనే వారిద్దరి మధ్య చర్చ జరిగినట్టు లగడపాటి మాటలను బట్టి అర్థమైంది. వచ్చే ఎన్నికల్లో లగడపాటి బరిలోకి దిగే అవకాశం ఉంది. అందుకోసమే లగడపాటి సీఎంను కలిసారని ఆయన అనుచరులు భావిస్తున్నారు. అయితే లగడపాటి మాత్రం ఆ ఛాన్సే లేదని కొట్టిపారేస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం లగడపాటితో పలు అంశాలను చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా కచ్చితత్వానికి మారుపేరైన లగడపాటి సర్వేలపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఆయన ద్వారా చంద్రబాబు రహస్య సర్వే చేయిస్తున్నారని సమాచారం. ప్రతి 6 నెలలకు సర్వే ద్వారా ప్రజలనాడిని పసిగట్టే పనిలో లగడపాటి ఉన్నారు. ఆ వివరాలనే చంద్రబాబుతో భేటీ అయి చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం.
లగడపాటి అంచనాల ప్రకారం ఈసారి కూడా చంద్రబాబుకు ఢోకా లేదు. సీఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో కూడా ఈ విషయాన్ని ఆఫ్ ది రికార్డ్ గా వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబుదే విజయమని స్పష్టం చేశారు. ఆయన పాలన బాగుందని, ఆయనకు వచ్చే ఎన్నికల్లో కూడా తిరుగులేదని లగడపాటి తేల్చి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ, జనసేన, బీజేపీ కత్తులు నూరుతున్నాయి. అయినా వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబుదే విజయం అని లగడపాటి చెప్పడంతో సెక్రటేరియేట్ మొత్తం ఈ అంశమే హాట్ టాపిక్ అయింది.