రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రకాశం జిల్లాలో టిడిపికి చెందిన కీలక నేత మాగుంట శ్రీనివాసరెడ్డి వైసిపిలో చేరనున్నారా ? జిల్లాలో జరుగుతున్న ప్రచారమైతే అవుననే సమాధానం వస్తోంది. వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నుండి స్పష్టమైన హామీ లభించగానే టిడిపికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారట. తమ పార్టీలోకి రావాలంటే ఎంఎల్సీ పదవికి ముందు రాజీనామా చేయాలని కూడా జగన్ స్పష్టం చేశారని సమాచారం. అందుకే మాగుంట చేరిక జాప్యం జరుగుతోందని వైసిపి వర్గాలంటున్నాయ్. ఇంతకీ విషయం ఏమిటంటే, ఒంగోలు మాజీ ఎంపి ప్రస్తుత ఎంఎల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. 2014 ఎన్నికల నేపధ్యంలో చాలామంది కాంగ్రెస్ నేతల్లాగానే మాగుంట కూడా టిడిపిలో చేరారు. మంత్రి పదవి హమీతోనే మాగుంట టిడిపిలో చేరారట. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. దాంతో కొంత కాలం స్తబ్దుగా ఉండిపోయారు. తర్వాత స్ధానిక సంస్ధల కోటాలో మాగుంట మళ్ళీ ఎంఎల్సీ అయ్యారు. ఎటూ ఎంఎల్సీగా గెలిచారు కాబట్టి మంత్రిపదవిని ఆశించారు. అయితే, చంద్రబాబు పట్టించుకోలేదు. దాంతో అప్పటి నుండి నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
పార్టీ కార్యక్రమాలకు దూరం ?
ఎప్పుడైతే చంద్రబాబుకు మాగుంటకు మధ్య దూరం పెరిగిందో జిల్లాలోని మిగిలిన నేతల్లో అత్యధికులు కూడా ఎంఎల్సీని దూరం పెట్టేశారు. జిల్లాలో ఏ పార్టీ కార్యక్రమం జరిగినా మొక్కుబడి ఆహ్వానం తప్పితే మనస్పూర్తిగా నేతలెవరూ తమతో కలుపుకున్న దాఖలాలు చాలా తక్కువనే చెప్పాలి. అదే సమయంలో చంద్రబాబు సమక్షంలో జరిగిన జిల్లా సమీక్షా సమావేశాల్లో కూడా మాగుంట పాత్ర చాలా పరిమితమన్న విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ హయాంలో జిల్లాలో ఓ వెలుగు వెలిగిన మాగుంట కుటుంబం మారిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో అనాధరణకు గురైంది. దాంతో మాగుంటతో పాటు ఆయన మద్దతుదారుల్లో కూడా చంద్రబాబు, టిడిపిపై తీవ్ర అసంతృప్తి పేరుకుపోయింది.
భవిష్యత్తేంటి ? ఒంగోలు ఎంపినా ?
నిరాదరణకు గురైన మాగుంట భవిష్యత్తుపై ఆందోళన పెరిగిపోయింది. ఎందుకంటే, ఏడాదిలో వస్తున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు విషయంలో ఆయోమయంలో పడినట్లు సమాచారం. ఇపుడే పార్టీలో ఎవ్వరూ పట్టించుకోకపోతే ఎన్నికల సమయంలో తనకు దిక్కెవ్వరన్నది మాగుంట ఆలోచన. పైగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా గెలిచేంత వరకూ నమ్మకం లేదు. ప్రభుత్వంపై జనాల్లో పెరిగిపోయిన వ్యతిరేకతను గమనించిన తర్వాత మాగుంట ప్రత్యామ్నాయం గురించి ఆలోచన మొదలుపెట్టినట్లు సమాచారం. అందులో భాగంగా వైసిపి ఒక్కటే మార్గంగా గుర్తించారట. అదే విషయాన్ని వైసిపిలోని తన సన్నిహితులతో ప్రస్తావించారు. ఆ విషయం జగన్ వద్ద ప్రస్తావనకు వచ్చినపుడు మాగుంట చేరికకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. అయితే, మాగుంటను ఎక్కడి నుండి పోటీ చేయించాలనే విషయమే తేలలేదట. పరిస్ధితులన్నీ అనుకూలిస్తే బహుశా ఒంగోలు పార్లమెంటు నుండి పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని పార్టీ వర్గాలంటున్నాయి.