చంద్రబాబునాయుడుకన్నా మంత్రి అఖిలప్రియ నాలుగాకులు ఎక్కువే చదివినట్లుంది. ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్రమోడిపై విధానపరమైన ఆరోపణలు, విమర్శలు చేస్తుంటే తాజాగా మంత్రి అఖిలప్రియ మాత్రం వ్యక్తిగతంగా మోడిని టార్గెట్ చేసింది. బిజెపి పాలనలో మహిళలు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నట్లు మండిపడ్డారు. మహిళలు ఎక్కడ కనిపిస్తే అక్కడ దాడులు చేయాలని, అత్యాచారాలు చేయాలని నేతలను రెచ్చగొట్టి పంపుతున్నట్లు మోడిపై ధ్వజమెత్తారు. మోడిని ఉద్దేశించి మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు టిడిపి, బిజెపిల్లో కలకలం రేపుతోంది.
దాడులు, అత్యాచారాలు చేస్తున్నదెవరు ?
నిజానికి రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యచారాలు పెరిగిపోయిన మాట వాస్తవమే. అయితే, ఏ సంఘటనలో కూడా బిజెపి నేతలు కానీ వారి మద్దతుదారులు కానీ ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు లేవు. పైగా పోలీసులు కూడా ఎక్కడా వారిపై ఇంత వరకూ ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. అదే సమయంలో మహిళలపై దాడులు, అత్యాచారాల ఘటనల్లో టిడిపి నేతలు, వారి మద్దతుదారుల పేర్లే వెలుగు చూశాయి. విజయవాడలో సంచలనం సృష్టించిన కాల్ మనీ సెక్స్ రాకెట్, అమ్మాయిల కిడ్నాప్, మహిళా అధికారి వనజాక్షిపై దాడి తదితరాల్లో ఎక్కువగా టిడిపి నేతల ప్రేమయం అందరికీ తెలిసిందే. వాస్తవాలు ఇలావుండగా అఖిలప్రియేమో ఏకంగా ప్రధానమంత్రిపైనే ఆరోపణలు చేయటం విచిత్రంగా ఉంది. పైగా కర్నూలులో శనివారం మొదలైన నవనిర్మాణ దీక్షలో మాట్లాడటం గమనార్హం.