ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. జాతీయ ప్రాజెక్టు అయిన దీనికి కేంద్రం సకాలంలో నిధులు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే విఙ్జప్తులు చేస్తున్నారు.
మరోపక్క పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు ప్రభుత్వ అనుయాయులకే ముఖ్యమైన కాంట్రాక్టులు దక్కుతున్నాయనే ఆరోపణలు తీవ్రంగానే ఉన్నాయి. అవినీతి వరద లో ఈ ప్రాజెక్టు కూరుకుపోతోందని సమాచారం. వందల కోట్ల రూపాయలలో అవినీతి జరుగుతోందని ప్రతిపక్షాలన్నీ ఏకకంఠంతో విమర్శలు వెల్లువెత్తిస్తున్నాయి. మరో ఏడాదిలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పోలవరం కల కనీసం ఎప్పటికి నెరవేరుతుందో తెలియని అనిశ్చిత అయోమయ పరిస్థితి ఏపిలో నేలకొని ఉంది.
పురుగు మీద పుట్రలా ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బలమైన షాకే ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి నేడు (శనివారం) కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్ కు నవీన్ పట్నాయక్ లేఖ రాయడం తీవ్ర కలవరం కలిగించింది.
వీలైనంత వేగంగా పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు నవీన్ పట్నాయక్ లేఖ అడ్డంకులు కల్పిస్తోందనే అనుమానాలు చుట్టుముడుతున్నాయి. ఎన్డీఏ నుండి వైదొలిగిన తర్వాత రాజకీయంగా టిడిపిని ఇబ్బంది పెట్టేందుకు బిజెపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని, అసలు ప్రోజెక్ట్ పై కూడ ఆరోపణలు చేసి ప్రాజెక్టును అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని టిడిపి నేతలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. 2019ఎన్నికల నాటికి పోలవరం ప్రాజెక్టు ద్వారా నీటిని అందించి ఎన్నికల్లో గెలవాలనేది చంద్రబాబు తాపత్రయం.
పట్టిసీమ నిర్మాణం పద్దతిలోనే ఎలాగోలా పోలవరాన్ని పూర్తిచేసి ఆ విజయం తన ఖాతాలో వేసుకోవాలనేది చంద్రబాబు ప్రణాళిక. ఎన్డీఏ బీజేపీతో తెగదెంపులు చేసుకోవడంతో ప్రస్తుతం కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎటువంటి సహకారం అందడం లేదు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు నవీన్ పట్నాయక్ షాకిచ్చారు. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు పనులను వెంటనే ఆపివేయాలని కోరుతూ కేంద్ర పర్యావరణశాఖ మంత్రి హర్షవర్థన్ కు లేఖ రాస్తూ, ఆ ప్రాజెక్టు వల్ల ఒడిశా అనేక పర్యావరణ సమస్యలు ఎదుర్కోబోతోందని వాటిని పరిష్కరించిన తర్వాతే నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వాలని నవీన్ పట్నాయక్ కోరారు.
ముంపు పునరావాసం తదితర అంశాలపై స్పష్టత వచ్చేవరకు పనులను కొనసాగించవద్దని లేఖలో కోరారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే కొన్ని ప్రాంతాలను ఒడిశా వాసులు శాశ్వతంగా కోల్పోతారని పేర్కొన్నారు. గతంలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పోలవరం అంశంపై నవీన్ పట్నాయక్ రెండు సార్లు లేఖ రాసిన సంగతి తెలిసిందే.