జనసేనాని.. పవన్ తన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు సరికొత్త టార్గెట్ పెట్టారు. ఇటీవల తాను ఎక్కడ పర్యటిస్తున్నా.. అక్కడకు చేరుకుంటున్న అభిమానులు ఆయనను `సీఎం-సీఎం` అంటూ సంబోధిస్తున్న విషయం తెలిసిందే. అయితే, పవన్ మాత్రం వారిని వారిస్తున్నారు. అభిమానులు సంయమనం పాటించాలని కోరుతున్నారు. అదేసమయంలో తనను సీఎం కావాలని కోరుతున్న అభిమానులు.. తనపై నిజంగా అభిమానం ఉంటే.. ఆ అభిమానా న్ని ఓట్ల రూపంలో మలిచేలా కార్యాచరణ రూపొందించాలని పవన్ పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఉత్తరాంధ్ర లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోఆయన తన అభిమానులు కూడా కలుస్తున్నారు. మొత్తంగా తన వ్యూహాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు.
ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. తాను అధికారంలోకి రాగానే ఆయా సమస్యలను పరిష్కరిస్తానని వాగ్దానా లు చేస్తున్నాడు పవన్. ఇక, ఈ సమయంలోనే తాను సీఎం అయ్యేందుకు అవసరమైన రూట్ను క్లియర్ చేసుకుంటుం డడం గమనార్హం. ఈ క్రమంలోనే తాను సీఎం కావాలంటే... ఒక్కో కార్యకర్త 500 ఓట్లు వేయించాలని పవన్ తాజాగా పిలుపునివ్వడం గమనార్హం. నిజానికి రాజకీయాల్లో ఇప్పటి వరకు ఇలాంటి వ్యూహాత్మక వైఖరితో ముందుకు వెళ్లిన నాయకులు కనిపించలేదు. ఎక్కడైనా పార్టీని బలోపేతం చేయాలని, ప్రజల్లోవిస్తృతంగా పర్యటించి వారి సమస్యలు తెలుసుకోవాలని కోరడం నాయకులకు పరిపాటి.
కానీ, పవన్ వీటికి విరుద్ధంగా పార్టీ బలోపేతం వంటి విషయాలను పక్కన పెట్టి ఓట్ల రాజకీయాలకే తెరలేపడం గమనార్హం. అసలు పార్టీని పవన్ పక్కన పెట్టి ఓట్ల కోసం ప్రజల్లోకి వెళ్లి ఒక్కొక్క కార్యకర్త.. కనీసం 500 ఓట్లు పడేలా చూడాలని కోరుకోవడం ద్వారా.. వారిని అనవసరమైన వివాదాల్లోకి లాగుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం జనసేనకు ఉన్న కార్యకర్తలు ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఒక్కొక్కరు 500 ఓట్లు వేయిస్తే.. సరిపోతుందా? అనేది కూడా ప్రశ్న. ఇక, పవన్ చేస్తున్న ఈ యాత్ర మొత్తం చంద్రబాబుపై విమర్శలు మినహా తాను అధికారంలోకి వస్తే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాడు అనే విషయాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా వివరించలేదు.
ప్రజలను కలలను గుర్తించి వారి కోరికలను పార్టీ హామీలుగా ఇస్తే ప్రజల మనసు దోచుకోవచ్చు గాని వారి మనసులను పట్టించుకోకుండా కేవలం ఓట్ల రాజకీయాలకు పవన్ తెరదీయడం విమర్శలకు తావిస్తోంది. వాస్తవానికి తనకు అధికారం అక్కరలేదని చెప్పి.. ఆరు మాసాలైనా కాకుండా అధికారం కోసం సీఎం సీటుకోసం పవన్ తహ తహ లాడుతుండడం విస్మయానికి గురి చేస్తోంది.