తెలంగాణ శాసనసభ ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వరద్దు వ్యవహారంలో కాంగ్రెస్కు మరోసారి ఊరట లభించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ల సభ్యత్వాలు రద్దు చేయడాన్ని తప్పు బడుతూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 12మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెరాస పిటిషన్ విచారణార్హతపై వేసవి సెలవుల ముందర వాదనలు విన్న ధర్మాసనం, ఈ విషయంపై నేడు (సోమవారం) కోర్టు తీర్పు వెలువరించింది.
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలి గందరగోళం సృష్టించాని అంటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంపత్కుమార్ల సభ్యత్వాలను ప్రభుత్వం రద్దు చేసింది. దీనికి సంబంధించి రెండు జీవోలను కూడా విడుదల చేసింది. ఈ ప్రొసీడింగ్స్ను, నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ వెంకటరెడ్డి, సంపత్ కుమర్ లు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ శివశంకరరావు ప్రొసీడింగ్స్ను, నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ఏప్రిల్ 17న తీర్పు ఇచ్చారు. అయితే జస్టిస్ శివశంకరరావు తీర్పును సవాల్ చేస్తూ 12మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు.
సింగిల్ జడ్జి ఎదుట దాఖలైన వ్యాజ్యంలో ఈ ఎమ్మెల్యేలు ప్రతివాదులు కాదు. అందువల్ల సంబంధం లేని వ్యక్తులు అప్పీల్ దాఖలు చేయాలంటే కోర్టు అనుమతి నివ్వాలి. ఈ నేపథ్యంలో వారు అప్పీల్ దాఖలుకు కోర్టు అనుమతి కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం అప్పీల్ దాఖలుకు అనుమతి నివ్వాలా? లేదా? అన్న దానిపై విచారణ ప్రారంభించింది. తెరాస ఎమ్మెల్యేల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదించారు.
దీనిపై హైకోర్టు తలుపు తట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్లపై విధించిన నిషేధం చెల్లదని, వారి సభ్యత్వాలను వెంటనే పునరుద్ధరించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ప్రతివాదులుగా ప్రభుత్వం, ఎన్నికల సంఘం మాత్రమే ఉన్నందున వారి అభిప్రాయాలనే పరిగణనలోకి తీసుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని కాంగ్రెస్ తరపు న్యాయవాది వాదించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్కు విచారణ అర్హత లేదని కొట్టివేసింది. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
తమ పార్టీ ఎంఎల్ఎల సభ్యత్వరద్దు విషయంలో గతంలోనే హైకోర్టు తీర్పుఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని, కోర్టుతీర్పును గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సిఎల్పి నేత జానా రెడ్డి తెలిపారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సభ్యులు ఆవేదనతో తమపై ఆరోపణలు చేయొచ్చని, సిఎల్పి తరుపున చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. రాజీనామా అంశంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డితో తాను చర్చించలేదని, కోమటిరెడ్డి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో గవర్నర్ ప్రసంగం సమయంలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్ల శాసనసభ సభ్యత్వాలరద్దు విషయం లో హైకోర్టులో వారికి ఊరట లభించింది.