అరకు రీసార్ట్ లో ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల సమస్యలు, అత్యవసరంగా కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకుందని అన్నారు. ప్రకృతికి దగ్గరగా బతికేవాళ్ల దగ్గర అవినీతి ఉండదు. దానిని దాటి ఏదో సంపాదించుకోవాలన్న అత్యాశతోనే అవినీతికి బీజం పడుతుంది. అభివృద్ధికి మైనింగ్ అవసరమే. అయితే అది ఎక్కడ తవ్వాలి? ఎంతమేరకు? అనేది నిబంధనలకి అనుగుణంగా ఉండాలి.
అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికింద తవ్వినా ఏదో ఒక ఖనిజం దొరుకుతుంది.గిరిజనులను భయపెట్టి, బలహీనులుగా చేసే వారిపై పోరాడటానికి వచ్చాను. ఈ విషయంలో మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాను. బాక్సైట్ తవ్వకాలపై గ్రామ సభలు పెట్టి, 70 శాతం ప్రజల ఆమోదంతోనే తవ్వకాలు జరపాలి. కొద్దిమంది ఏసీ గదుల్లో కూర్చొని గిరిజన పాలసీలు రాస్తున్నారు.
వారు గిరిజన గూడేలు తిరిగి పాలసీ రాస్తే అది ఉపయోగపడుతుంది. మత్స్యకారులను ఎస్టీల్లో చేరుస్తామని టీడీపీ తన మేనిఫెస్టోలో పెట్టింది. దానిని నేను ప్రశ్నిస్తే నాపై గిరిజనుల్ని రెచ్చగొట్టారు. చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ జీవితం కులాల మధ్య కుమ్ములాటలు పెట్టడానికి పనికొచ్చింది” అని అన్నారు.