దేవుడు దయదలిచాడు? - జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్?
కేంద్ర ప్రభుత్వ చమురు మరియు సహజ వాయువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దేశంలో హద్ధులు లేకుండా పెరిగిపోతున్న ఇందన నూనెల ధరలను తగ్గించే ప్రయత్నం చేయటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అయితే దానికై అన్వేషించే విధానాలుగాని వ్యూహాల వివరాలు గాని ఆయన తెలియజేయలేదని బిజినెస్ స్టాండర్డ్ తెలియచేసింది.
ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో జనం బెంబేలెత్తి పోతూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహాన్ని అగ్ని కీలలుగా రగిల్చక ముందే ఉపశమన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవు తోంది.
చమురు ధరలను తగ్గించే అవకాశాలపై ప్రభుత్వం సమగ్రంగా ఆలోచిస్తుందని తెలుస్తుంది. అయితే వారికి కనిపిస్తున్న అవకాశాలను నాలుగు అంశాలుగా విభజించారు. వాటి గుఱించి ప్రధానంగా చర్చిస్తోంది. అందులో ముఖ్యమైనది చమురును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఎప్పటి నుంచో పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ ప్రజల నుండి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ అవకాశాన్నీ సైతం కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. జీఎస్టీతో సహా మొత్తం నాలుగు రకాలుగా పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయించే సమగ్ర విధానంపై సంపూర్ణ అధ్యయనం చేస్తున్నారు.
జీఎస్టీ: ప్రజలు, చమురు డీలర్ల సంఘం, రెండూ పెట్రోల్, డీజిల్ ధరవరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి మాత్రం స్పందన కరువైంది. అయితే ప్రజల్లో కలకలం సృష్టిస్తున్నపెట్రోల్-డీజిల్ ధరలపెరుగుదలను నియంత్రించ వలసిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్రం ఆ అవకాశాన్ని కూడా సత్వరమే పరిశీలిస్తోంది.
జీఎస్టీ పరిధిలోకి చమురు ఉత్పత్తులను తీసుకురావడానికి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇంకా ఎలాంటి అంగీకారం రాలేదని ఇటీవలే రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇటు పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ - చమురు సంస్థలు, ఇతర వ్యాపార భాగస్వాములతో జీఎస్టీ తో సహా అనేక అవకాశాలపై చర్చిస్తున్నారు. రాష్ట్రాలు అంగీకరిస్తే జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకూ కేంద్ర ప్రభుత్వం సుముఖంగానే ఉంది. ఒకవేళ రాష్ట్రాలు ఒప్పుకొని కేంద్రం ఆ నిర్ణయాన్ని అమలు చేస్తే 50 శాతంగా ఉన్న పన్నులను 30 నుంచి 40 శాతానికి తగ్గించినా వినియోగ దారుడికి చాలా మేలు కలుగుతుంది.
ఓఎన్జీసీ: "చమురు మరియు సహజ వాయువుల సంస్థ" - ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆద్వర్యంలో ఓఎన్జీసీ అంతర్జాతీయ మార్కెట్లో ధరలకు అనుగుణంగా రోజువారీ ధరల సమీక్షను చేపట్టింది. ఇప్పుడు అదే అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మనం విధించే పన్నుల సమీక్షను కూడా చేపట్టాలన్న తలంపుతో అందుకు అను గుణంగా ఓఎన్జీసీతో చర్చలు జరుపుతోంది. ఎందుకంటే మనకు అవసరమైన చమురులో 20 శాతం ఓఎన్జీసీనే సరఫరా చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ధరలకు అనుగుణంగానే ఓఎన్జీసీ కూడా ధరలను నిర్ణయిస్తోంది. ఇప్పుడు అలా కాకుండా 20 శాతం దేశీయం ఉత్పత్తి అయ్యే చమురు ధరలను ప్రత్యేకంగా తగ్గించేలా “ఓఎన్జీసీ” తో చర్చిస్తోంది. రిటైలర్లకు తక్కువ ధరలకే పెట్రోల్, డీజిల్ను విక్రయించాలని సూచిస్తోంది. ధరలను తగ్గిస్తే ఓఎన్జీసీ నుంచి కేంద్రానికి అందే డివిడెండ్ నూ తగ్గించుకునేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.
ఫ్యూచర్స్ ట్రేడింగ్: పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు అందుబాటులో ఉన్న మరో అవకాశం. పెట్రోల్, డీజిల్ ధరలను ఫ్యూచర్ ట్రేడింగ్స్ లో పెట్టడం. ఇప్పటికే భారత కమోడిటీ ఎక్స్చేంజీ – ఐసీఈఎక్స్ కు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సూత్రప్రాయంగా తమ అంగీకారాన్ని కూడా తెలిపారు ఎండీ సంజిత్ ప్రసాద్.
అంతేకాకుండా ఐసీఈఎక్స్ ఎండి, దీనికి పెట్రోలియం శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా వచ్చిందన్నారు. అయితే, పెట్రోల్, డీజిల్ను ఫ్యూచర్ ట్రేడింగ్స్లోకి తేవాలంటే “సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా-సెబీ” నుంచి అనుమతి కూడా రావాల్సి ఉంటుందని ఆయనచెప్పారు. ఇందులో భాగంగా ఉత్పత్తులు, వస్తువులను ప్రస్తుత మార్కెట్ ధరకే భవిష్యత్తులో అమ్మేలా చూస్తారు. అదే ఫ్యూచర్ ట్రేడింగ్. ఉదాహరణకు ఒక వంద లీటర్ల పెట్రోల్ను ప్రస్తుత ధర ప్రకారం ఒక నెల లేదా నిర్దేసితకాలం తర్వాత అందించేలా అంగీకారం కుదుర్చుకోవడం.
ఒపెక్ నుంచి రాయితీ: ప్రస్తుతం అమలులో ఉన్న పెట్రోలియం ఉత్పత్తుల ధరల ప్రకారం ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ — ఒపెక్ పాశ్చాత్య దేశాలకు ఒక ధర లేదా రేట్, ఆసియా దేశాలకు మరో ధరకు చమురును సరఫరా చేస్తున్నాయి.
అయితే భారత్ తో సహా ఆసియా దేశాలకు, ఒపెక్, పెట్రోలియం ఉత్పత్తులను అధిక ధరలకు అమ్ముతోంది. నరెంద్ర మోడీ భారత ప్రధాని ఐన తరవాత విదేశాంగ విధానం లో అనేక మార్పులు తీసుకొని వస్తున్న నేపథ్యంలోనే, ఈ విషయంలో ‘ఆసియా దేశాలను ఏకం చేసి’ ఆసియాకు కూడా చమురు ధరల్లో రాయితీ సాధించే లాగా ఒపెక్ ను ఒప్పించి ప్రకటన వచ్చేలాగా చేసే ప్రయత్నం చేస్తుంది.
చివరగా ఇవేవీ కుదరకపోతే అంతర్జాతీయ మార్కెట్లలోని చమురు ధరలకు అనుగుణంగా భారత మార్కెట్ లో ధరలను అనుసంధానం చేసి వీటిని GST పరిధిలోకి తెచ్చి వీలైనంత తక్కువ ధర నిర్ణయించడం తప్ప అంతకు మించి ప్రస్తుతం ఆశించే ఇతర అవకాశాలు కనిపించటం లేదు. అయితే దీనికి అభ్యంతరం పలికేవి రాష్ట్ర ప్రభుత్వాలు. ధరలు పెరిగితే కెంద్రాన్ని తిట్టిపోస్తూ ధరలు తగ్గించటం తమచేతుల్లో ఉన్నా సహకారం అందంచని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఒప్పించటం చాలా అవసరం.