కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెండు ప్రధాన పార్టీలకు పెద్ద టెండరే పెట్టారట. రానున్న ఎన్నికల్లో కాపుల్లో ఏపార్టీ ఎక్కువ సీట్లు ఇస్తుందో ఆ పార్టీకే కాపు సామాజికవర్గం గంపగుత్తగా మద్దతు ఇస్తుందని రాయబారం పంపుతున్నారని సమాచారం. అందులో భాగంగానే తన మద్దతుదారుల్లో కనీసం 6 మందికి అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వాలన్నది ముద్రగడ డిమాండ్ గా కాపు వర్గాలు చెప్పాయి. ఈ విషయాన్ని వైసిపిలోని తన సన్నిహితుల ద్వారా జగన్ కు చేరవేశారట. అయితే, జగన్ స్పందన ఏమిటన్నది తెలియలేదు లేండి.
జగన్ కోసం సిద్దం చేసిన జాబితా ?
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జెఏసి ఛైర్మన్ వాసిరెడ్డి ఏసుదాసు, కొత్తపేటలో ఆకుల రామకృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నియోజవర్గంలో చిన్నమిల్లి వెంకటరాయుడు, వైజాగ్ లో తోట రాజీవ్, శ్రీకాకుళం అసెంబ్లీ టిక్కెట్టు ఓ అడ్వకేట్ కు, కర్నూలు సీటును ఒక డాక్టర్ కు ఇవ్వాలంటూ జగన్ కు ముద్రగడ ఓ జాబితాను కూడా పంపినట్లు సమాచారం. కాపులు గెలిచే సీట్లలో ఎలాగూ ముద్రగడ చెప్పినా చెప్పకపోయినా కాపులకే జగనే సీట్లు ఇస్తారు. అయితే, కాపుల్లో కూడా తన మద్దతుదారులకు టిక్కెట్లు ఇప్పించుకోవాలన్నది ముద్రగడ పట్టుదలగా కనిపిస్తోంది.
బిజెపిలో ఎక్కువ సీట్లకు టెండర్
అదే విధంగా మరో జాబితాను తన సన్నిహితుడు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు కూడా అందచేసినట్లు కాపు నేతలు చెబుతున్నారు. ముద్రగడ అంచనా ప్రకారం వచ్చే ఎన్నికల్లో కాపులకు అందరికన్నా ఎక్కువ సీట్లు బిజెపినే ఇవ్వగలదు. ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లోనూ పోటీకి నిలపాలంటే పార్టీ పరంగా బిజెపికి అభ్యర్ధుల కొరత ఉంది. నిజానికి ఒంటరిగా పోటీ చేసేంత సీన్ కమలంపార్టీకి లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే పార్టీ నేతలని కాకుండా వివిధ సామాజిక వర్గాల నుండి కూడా ప్రముఖులను కూడా అభ్యర్ధులుగా ఎంపిక చేసే అవకాశం ఉంది. అందుకే ముద్రగడ ఇప్పటి నుండే బిజెపితో బేరాలు పెడుతున్నారు. మరి, ముద్రగడ బేరాలు ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.