ఇదే విషయం రాష్ట్రంలోని అందరి బుర్రలనూ తొలిచేస్తోంది. ప్రజా సంకల్పయాత్ర మొదలుపెట్టినప్పటి నుండి వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు జనాలు బాగా స్పందిస్తున్నారు. పోయిన ఏడాది నవంబర్ 6వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర ఇప్పటికి 181 రోజులు పూర్తి చేసుకుంది. ప్రారంభంలో జనాల స్పందన తక్కువగానే ఉన్నా రాను రాను ఎక్కువవుతోంది. రాయలసీమ మొత్తం మీద చూసుకుంటే అనంతపురం జిల్లాలో ప్రజలు బాగా స్పందించారనే చెప్పాలి. ఇక, యాత్ర రాయలసీమ నుండి కోస్తా జిల్లాల్లోకి అంటే నెల్లూరులోకి ప్రవేశించిన తర్వాత ఊపందుకుంది.
అక్కడి నుండి ప్రకాశం జిల్లాలోకి అడుగుపెట్టిన తర్వాత జనాలు స్పందన బ్రహ్మాండమనిపించింది. తర్వాత గుంటూరు అక్కడి నుండి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత యాత్రలో వేగం పెరిగింది. జనాల స్పందన కూడా అద్భుతమనే చెప్పాలి. కృష్ణా జిల్లాలో నుండి పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులోకి ప్రవేశించిన జగన్ కు జనాలు నీరాజనాలే పడుతున్నారు.
ఎక్కడో అనుమానం
పాదయాత్ర వరకూ బాగానే ఉంది. పాదయాత్రకు జనాల స్పందన బాగానే ఉందనుకున్నా ఎక్కడో చిన్న అనుమానం. పాదయాత్రలో జగన్ కు సానుకూలంగా స్పందిస్తున్న జనాలంతా వచ్చే ఎన్నికల్లో వైసిపికే ఓట్లు వేస్తారని గ్యారెంటీ ఏమిటి ? తటస్తులనే కాదు, వైసిపి అభిమానులను కదిపినా ఇదే అనుమానం వ్యక్తమవుతోంది. జగన్ యాత్రకు ఒకవైపు జనాలు ఇంత భారీగా స్పందిస్తున్న విషయం ప్రత్యక్షంగా కళ్ళకు కనిపిస్తున్నా ఇంకా అనుమానాలు వస్తున్నాయంటే అర్ధమేంటి ? అదే ఎవరికీ అంతుపట్టటం లేదు.
నంద్యాలలో ఏం జరిగింది ?
నంద్యాల ఉప ఎన్నికనే ఉదాహరణగా తీసుకుందాం. ఉప ఎన్నిక ప్రచారం జరిగినంత కాలం వైసిపి అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డికి తిరుగులేదనే అనుకున్నారు. ఎందుకంటే, జగన్ ఎక్కడ పర్యటించినా జనాలు తండోపతండాలుగా వచ్చారు. చివరకు వర్షం కురుస్తున్నా జగన్ ప్రసంగం కోసం జనాలు ఓపికగా ఎదురుచూసిన విషయం అందరికీ తెలిసిందే. గెలుపు విషయాన్ని పక్కనపెట్టి మెజారిటి ఎంతనే విషయంపైనే రాష్ట్రమంతా చర్చ జరిగింది. ఒకవైపు వైసిపిలో మెజారిటిపై చర్చ జోరుగా సాగుతున్నా చంద్రబాబునాయుడును తక్కువ అంచనా వేసేందుకు లేదన్న వాదన కూడా వినిపించింది.
బోసిపోయిన చంద్రబాబు క్యాంపు
ఒకవైపు జగన్ సభలకు, ర్యాలీలకు జనాలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు చంద్రబాబు సభలు వెలా తెలా పోయాయి. చివరకు చంద్రబాబు నిర్వహించిన రోడ్డుషోలకు జనాలే కరువైన సంగతి అందరికీ తెలిసిందే. ప్రచారమైపోయింది. పోలింగ్ కూడా అయిపోయింది. కౌంటింగ్ మొదలైన తర్వాత చూస్తే టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి 27 వేల మెజారిటీతో గెలిచారు. ఫలితం చూసిన వారికి దిమ్మ తిరిగిపోయింది. టిడిపి అభ్యర్ధి ఎలా గెలిచారో ఎవరికీ అర్ధం కాలేదు. చంద్రబాబు, జగన్ ప్రచారాన్ని ప్రత్యక్షంగా చూసిన వారికి టిడిపి అభ్యర్ధి ఎలా గెలిచారో అర్ధం కాలేదు. తర్వాత ఎలక్షనీరింగ్ లో చంద్రబాబు చాణుక్యం అర్ధమై నోరెళ్ళబెట్టారు.
ఇపుడేం జరుగుతోంది ?
ఇపుడు కూడా నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో జరుగుతున్నట్లే జరుగుతోంది. ఎక్కడ చూసినా జనాలే జనాలు. జగన్ పాదయాత్రకు వస్తున్న జనాలు, పాదయాత్రకు బ్రహ్మరధం పడుతున్న జనాలందరూ రేపటి ఎన్నికల్లో వైసిపికే ఓట్లు వేస్తారా ? నిజానికి పాదయాత్రలో పాల్గొంటున్న జనాలు, స్పందిస్తున్న పద్దతిలో వైసిపికి ఓట్లు వేస్తే జగన్ ముఖ్యమంత్రి అవటం ఖాయమనే అనిపిస్తోంది. కానీ ఓట్లు వేస్తారా ? అన్న విషయంలోనే ఎక్కడో అనుమానం. ఎందుకంటే, పాదయాత్ర చేయటం వేరు, ప్రచారం చేసుకోవటం వేరు. పోలింగ్ రోజున అనుసరించాల్సిన వ్యూహాలు వేరు. మిగిలిన విషయాలతో పాటు పోలింగ్ రోజున చేసుకునే ఎలక్షనీరింగ్ లోనే జగన్ విజయం ఆధారపడుంటుంది. ఎవరికైనా ఎనీ డౌట్ ?