రానున్న ఎన్నికల్లో హిందుపురం నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణకు చుక్కలు కనబడటం ఖాయమే అనిపిస్తోంది. ఈనెల 7, 8 తేదీల్లో నియోజకవర్గంలోని చిలమత్తూరు, లేపాక్షి మండలాల నేతలతో బాలకృష్ణ హిందుపురంలో సమీక్ష జరుపుతున్నారు. పార్టీలో పెరిగిపోయిన అసంతృప్తులను సర్దుబాటు చేసుకోవటమే సమావేశాల ముఖ్య లక్ష్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడెప్పుడో అంటే మూడేళ్ళ క్రితం నేతలతో సమావేశం నిర్వహించిన బాలకృష్ణ మళ్ళీ ఇంత కాలానికి సమావేశమవుతుండటం గమనార్హం. ఇపుడు కూడా సమావేశం ఎందుకు పెడుతున్నారంటే త్వరలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే. 7వ తేదీ చిలమత్తూరు, 8వ తేదీ లేపాక్షి మండల నేతలతో సమావేశమవుతున్నారు. 8 రాత్రి హిందుపురంలో ఇఫ్తార్ విందు ఇస్తున్నారు. 9వ తేదీ ఉదయం హైదరాబాద్ కు బయలుదేరుతారని పార్టీ వర్గాలు చెప్పాయి.
బాలకృష్ణ స్వయంకృతమే
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వంపై జనాల్లో పెరిగిన వ్యతిరేకతకు తోడు నియోజకవర్గంలో ఎంఎల్ఏ బాలకృష్ణపై పెరిగిపోయిన అసంతృప్తి బోనస్. మిగిలిన నియోజకవర్గాల్లో ఉన్నట్లే ఈ నియోజకవర్గంలో కూడా జనాలకు అసంతృప్తి ఉండటంలో వింతేమీలేదు. కాకపోతే బాలకృష్ణపై సొంత పార్టీ నేతలతో పాటు క్యాడర్ కూడా విపరీతంగా మండిపోతుండటమే విచిత్రంగా ఉంది. టిడిపిలోని అంతర్గత వ్యవహారాలను అవకాశంగా తీసుకుని ప్రధాన ప్రతిపక్షం వైసిపి దూసుకుపోతోంది. దాంతో వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ గెలుపుపై పార్టీలోనే అనుమానాలు మొదలయ్యాయి. ప్రస్తుత పరిస్ధితి ఒకరకంగా బాలకృష్ణ స్వయంకృతమనే చెప్పాలి.
పిఎ దెబ్బకు పెరిగిపోయిన అంసతృప్తి
ఎంఎల్ఏగా గెలిచిన వెంటనే పిఏగా చంద్రశేఖర్ ను నియమించుకున్నారు. నియోజకవర్గాన్ని పట్టించుకునే తీరిక లేదు కాబట్టి మొత్తం వ్యవహారాలను పిఏకే అప్పగించేశారు. దానికితోడు నేతలతో కూడా బాలకృష్ణకు టచ్ లో ఉండే అలవాటు లేదు. దాంతో పిఏ ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. దాంతో ఒక విధంగా పిఏనే ఎంఎల్ఏగా చెలామణి అయ్యారు. ఎప్పుడైతే పిఏకి అపరమితమైన అధికారాలు వచ్చాయో నియోజకవర్గంలో జరగాల్సిన పనులను పిఏనే డిసైడ్ చేయటం మొదలుపెట్టారు. ఎక్కడైనా వర్కు జరుగుతోందంటే పర్సంటేజీలు కూడా దండుకోవటం మొదలుపెట్టారు. ఆ విధంగా అడ్డదిడ్డమైన సంపాదన మొదలైంది.
నేతల తిరుగుబాటు
అదే సమయంలో నేతలను పిఏ చిన్న చూడటం మొదలుపెట్టారు. దాంతో నేతలకు, పిఏకి ఒక్క రోజు కూడా పడేది కాదు. అదే విషయాన్ని చెబుదామంటే బాలకృష్ణ వినిపించుకోలేదు. చంద్రబాబుకు చెప్పినా ఉపయోగం కనబడలేదు. దాంతో నేతలంతా రాజీనామాలు చేసి బాలకృష్ణపై తిరుగుబాటు లేవదేశారు. అప్పటికి గానీ చంద్రబాబు, బాలకృష్ణలకు వాస్తవాలు అర్ధం కాలేదు. అప్పటికప్పుడు బాలకృష్ణ నేతలతో అత్యవసర సమావేశం పెట్టారు. తర్వాత పిఏని మార్చేశారు. అయినా పరిస్దితిలో ఇప్పటికీ మార్పు రాలేదట. ఎందుకంటే, బాలకృష్ణ నేతలతో సరిగా టచ్ లో ఉండరు. దాంతో బాలకృష్ణపై నేతలు, క్యాడర్లో బాగా అసంతృప్తి పేరుకుపోయింది.
దూసుకుపోతున్న వైసిపి
ఎప్పుడైతే ఎంఎల్ఏ నియోజకవర్గంలోని నేతలను పట్టించుకోవటం మానేశారో ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి అవకాశంగా తీసుకుంది. ప్రజా సమస్యలపై జనాలను కూడదీసి ఆందోళనలు మొదలుపెట్టింది. దాంతో సహజంగానే ప్రతిపక్ష నేతలు జనాల్లో చొచ్చుకుని పోతున్నారు. పోయిన ఎన్నికల్లో బాలకృష్ణపై పోటీ చేసి ఓడిపోయిన నవీన్ నిశ్చల్ జనాలకు అందుబాటులోనే ఉంటున్నారు. ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నారు. దానికితోడు సహజంగానే ప్రభుత్వంపై జనాల్లో పెరిగిపోయిన అసంతృప్తి కూడా వైసిపికి కలసి వచ్చింది. ఇటువంటి పరిస్దితుల్లో వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ మళ్ళీ పోటీ చేసే విషయం అనుమానమనే ప్రచారం జరుగుతోంది. పోటీ చేసే విషయంలో జరుగుతున్న ప్రచారంపై బాలకృష్ణ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.