ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఇరగదీశారు. యాత్ర మొదలై 6 మాసాలైన తర్వాత ఇపుడు ఇరగదీయమేంటి ? అన్న అనుమానం వచ్చిందా ? అదే చదవండి. ఈ రోజు ఉదయం తణుకు బహిరంగ సభలో జగన్ గోదావరి యాసలో కాసేపు మాట్లాడారు. పక్కా రాయలసీమ వాసి అయిన జగన్ పూర్తి విరుద్దంగా ఉండే గోదావరి యాసలో చంద్రబాబునాయుడుపై సెటైర్లు వేయటాన్ని జనాలు బాగా ఎంజాయ్ చేశారు. కంప్యూటర్లు కనిపెట్టింది చంద్రబాబేనండి, సెల్ ఫోన్లు కనిపెట్టింది కూడా చంద్రబాబేనండి, మైక్రోసాఫ్ట్ సిఇవో సత్యా నాదెళ్ళకు కంప్యూటర్ చదువు నేర్పింది కూడా చంద్రబాబేనండి ఆయ్ అంటూ చంద్రబాబు, లోకేష్ లపై జగన్ సెటైర్ల రూపంలో ఆరోపణలు, విమర్శలు మొదలుపెట్టటంతో ఆశ్చర్యపోయిన జనాలు తర్వాత కేరింతలతో జగన్ ను ప్రోత్సహించారు.
చంద్రబాబుపై సెటైర్లు
ఉదయం ఎవరో చంద్రబాబుపై ఆరోపణలను ఓ పేపర్లో రాసిచ్చి గోదావరి యాత్రలో చదవండని తనకు పేపర్ ఇచ్చారంటూ జగన్ చెప్పారు. చంద్రబాబుపై రాసిన ఆరోపణలను, విమర్శలను సెటైర్ల రూపంలో ఓ పేపర్ లో రాసుకుని జగన్ చదివి వినిపించటాన్ని జనాలు బాగానే ఎంజాయ్ చేశారు. ఇంతకుముందు .నెల్లూరు, కృష్ణ జిల్లాల్లో పర్యటించినపుడు జగన్ ఇలా ఆయా జిల్లాల యాసలో మాట్లాడలేదు. కానీ ఇక్కడ మాత్రం గోదావరి జనాలు అడిగి మరీ జగన్ తో తమ యాసలో మాట్లాడించుకోవటం గమనార్హం. ముందు ముందు ఉత్తరాంధ్రలో పర్యటించనున్న జగన్ ఆక్కడి యాసలో కూడా మాట్లాడుతారేమో చూడాలి.