వైసిపి ఎంపిలు చేసిన రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. బుధవారం ఉదయం 11 గంటలకు స్పీకర్ తో ఎంపిల భేటీ అయ్యారు. రాజీనామాలు ఆమోదించాంటూ ఎంపిలు పట్టుబట్టటంతో స్పీకర్ రాజీనామాలను ఆమోదించారు. సమావేశం తర్వాత లోక్ సభ ఉన్నతాధికారులతో సమావేశమైన స్పీకర్ తర్వాత ఎంపిల రాజీనామాలు ఆమోదించాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విషయాన్ని ఐదుగురు ఎంపిలకు సమాచారం అందించినట్లు సమాచారం. మొత్తానికి వైసిపి ఎంపిలు పట్టుబట్టి తమ రాజీనామాలను స్పీకర్ దగ్గర ఆమోదింపచేసుకున్నారు. ఇందుకు అవసరమైన నోటిఫికేషన్ ను ఈరోజు సాయంత్రం పార్లమెంటు ఉన్నతాధికారులు ప్రకటించనున్నారు. రాజీనామాలు చేసిన దాదాపు రెండు నెలల తర్వాత తమ డిమాండ్ ప్రకారం స్పీకర్ రాజీనామాలను ఆమోదించటం గమనార్హం.
పెరిగిపోయిన హీట్
ఎప్పుడైతే వైసిపి ఎంపిల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారో వెంటనే రాష్ట్రంలో రాజకీయంగా హీట్ పెరిగిపోయింది. ఎందుకంటే రాజీనామాల పేరుతో వైసిపి ఎంపిలు డ్రామాలాడుతున్నారంటూ చంద్రబాబునాయుడుతో పాటు టిడిపి నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, స్పీకర్ ఎంపిల రాజీనామాలను ఆమోదించటంతో ఎవరిది డ్రామాలో జనాలకు అర్ధమైపోయింది.
ఉప ఎన్నికలు జరుగుతాయా ?
రాజీనామాలు చేసిన ఐదుగురు ఎంపిల స్ధానాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయా అన్నది పెద్ద ప్రశ్న. తిరుపతి, కడప, రాజంపేట, నెల్లూరు, ఒంగోలు ఎంపిలు వరప్రసాద్, అవినాష్ రెడ్డి, మిధున్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు ఉప ఎన్నికలకు సిద్దమని ప్రకటించారు. ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధులు పోటీ చేస్తే వారి బండారం బయటపడుతుందని సవాలు విసురుతున్నారు వైసిపి ఎంపిలు. అయితే, ఏడాదిలోనే సాధారణ ఎన్నికలు జరుగుతుండటంతో ఇపుడు ఉప ఎన్నికలు జరుగుతాయా అన్నది సస్పెన్స్ గా మారింది.