చంద్రగిరి తెలుగుదేశం పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే, బుధవారం సాయంత్రం సీనియర్ నేత గల్లా అరుణకుమారి తన మద్దతుదారులతో సమావేశమవుతున్నారు. బహుశా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి భవిష్యత్తు నిర్ణయించుకునేందుకు ఈ రోజు సమావేశం అవుతున్నారు. నియోజకవర్గంలోని తొండవాడలో ఓ హోటల్లో మద్దతుదారులతో సమావేశం జరుపుతున్నారని తెలియగానే టిడిపి నేతల్లో టెన్షన్ మొదలైంది. నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న గల్లా ఆమధ్య తన పదవికి రాజీనామా చేశారు. కారణాలేమైనా చంద్రబాబునాయుడుతో గల్లా కుటుంబానికి గ్యాప్ వచ్చిందన్నది వాస్తవం.
గల్లాలో అసంతృప్తి
పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి గల్లా కుటుంబం టిడిపిలో చేరారు. అరుణకుమారి చంద్రగిరిలో ఎంఎల్ఏగాను కొడుకు గల్లా జయదేవ్ గుంటూరు ఎంపిగా పోటి చేశారు. జయదేవ్ ఎంపిగా గెలిస్తే, అరుణకుమారి ఓడిపోయారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో అరుణకుమారి టిడిపి కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. ఒక్కోసారి చంద్రబాబు కార్యక్రమాలకు కూడా గైర్హాజరయిన సందర్భాలున్నాయి. దాంతో గల్లాకు చంద్రబాబుకు గ్యాప్ ఉందన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. తర్వాత మారిన పరిస్ధితుల్లో నియోజకవర్గం ఇన్చార్జి పదవికి కూడా అరుణకుమారి రాజీనామా చేసేశారు. అప్పటి నుండి పార్టీకి దూరంగా ఉంటున్నట్లే అని చెప్పుకోవాలి.
భవిష్యత్తేంటి ?
జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ జరుగుతున్న ప్రచారం ఏమిటంటే త్వరలో గల్లా అరుణకుమారి టిడిపికి కూడా రాజీనామా చేస్తారని. పరిస్దితులు కూడా అదే విధంగా ఉంది. వచ్చేఎన్నికల్లో పోటీ చేయకూడదని అరుణకుమారి నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఎంత వరకూ వాస్తవమో ఆమెకే తెలియాలి. ఒకవైపు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. ఇంకోవైపు అరుణకుమారి రాజకీయ భవిష్యత్ లో అయోమయం నెలకొంది. ఇటువంటి పరిస్దితుల్లో వైసిపిలో చేరుతున్నారని లేదు బిజెపిలో చేరుతారనే ప్రచార ఊపందుకుంది.
టిడిపిలోనే ఉంటాను
ఇదే విషయమై అరుణకుమారి మాట్లాడుతూ తాను ఏ పార్టీలోను చేరటం లేదని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటాను కాని ఏ నియోజకవర్గంలోనూ పోటీ చేసేది లేదన్నారు. టిడిపిని వదిలి ఏ పార్టీలోనూ చేరేది లేదని కూడా చెప్పారు. తన విషయంలో జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే తన మద్దతుదారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తన కొడుకు టిడిపిలోనే ఉంటాడని, గుంటూరు ఎంపిగానే పోటీ చేస్తాడని కూడా స్పష్టం చేశారు.