ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చాక మిత్రపక్షాల విలువేంటో మోదీ, అమిత్ షాలకు తెలిసిందని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మిత్రపక్షాలకు ద్రోహం చేసిన మోదీ, అమిత్ షాలు ఇప్పుడు మళ్లీ వాళ్ల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ఇలాగే వ్యతిరేక పవనాలు వీస్తే భవిష్యత్ లో తమకు పుట్టగతులు ఉండవని భావించిన బీజేపీ ఇప్పుడు మిత్ర పక్షాల వైపు మొగ్గు చూపిస్తున్నారు.
కొంత కాలంగా మోదీ, అమిత్ షా అహంభావంతో అద్వానీ, మురళీ మనోహర్ జోషీ లాంటి సీనియర్లను అగౌరవపరిచారని అన్నారు. ఇప్పుడేమో వాళ్ల ఇళ్లకు వెళ్లడం, శివసేన, అకాలీదళ్ పార్టీల చుట్టూ మోదీ, అమిత్ షాలు ప్రదక్షిణాలు చేయడం చూస్తుంటే బీజేపీ ఎలాంటి దుస్థితిలో ఉందో అర్థమవుతుందని అన్నారు.
లౌకికవాదం ఎంత ప్రమాదంలో ఉందో బిషప్లే చెప్పారన్నారు. ఈవీఎంల ద్వారా ప్రజాతీర్పును కాలరాయాలని చూశారన్నారు. కైరానా ఎంపీ స్థానం ఉపఎన్నిక ఫలితమే దానిని ఎండగట్టిందని చెప్పారు. ప్రజలకే కాదు భాగస్వామ్య పక్షాలకూ బీజేపీ నమ్మకద్రోహం చేసిందని మండిపడ్డారు. బీజేపీ ఒంటరిగా మిగిలిందని మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు.