వైసిపి ఎంపిల రాజీనామాలు స్పీకర్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రంలో చర్చ మొత్తం ఉప ఎన్నికలపైకి మళ్ళాయి. ఉప ఎన్నికలు వస్తాయని కొందరు, రాదని మరికొందరు ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. సరే, ఎవరి వాదనలు ఎలాగున్నా నిజంగానే ఉప ఎన్నికలు గనుక వస్తే పార్టీలు తట్టుకోగలవా ? అన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది. అందేలె కూడా మిగిలిన పార్టీల సంగతి ఎలాగున్న వైసిపి అభ్యర్ధులకు మాత్రమే ఇబ్బందనే చెప్పాలి. రాజీనామాల ఆమోదంతో మాజీ ఎంపిలైన ఐదుగురిలో ఆర్ధికంగా రాజంపేట, నెల్లూరు, ఒంగోలు, కడపకు ప్రాతినిధ్యం వహించిన మిధున్ రెడ్డి, మేకపాటి రాజగోపాలరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి గట్టివారే అనిపిస్తోంది. ఇక, తిరుపతికి ప్రాతినిధ్యం వహించిన వరప్రసాద్ పరిస్ధితిపై సరైన సమాచారం లేదు. ఎందుకంటే, మొదటి నలుగురు పారిశ్రామికవేత్తలు. వరప్రసాద్ ఐఏఎస్ అధికారిగా పనిచేశారు.
సెంటిమెంటునే నమ్ముకున్న వైసిపి
ఐదేళ్ళ కాలపరమితి కలిగిన ఎంపి పదవిని నాలుగేళ్లకే వదులు కోవటం ఇబ్బందే. కాకపోతే రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఓ సెంటిమెంటుపై రాజీనామాలు చేశారు కాబట్టి ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ గెలవవచ్చు అనే ధీమా వారిలో కనిపిస్తోంది. మామూలుగానే ఎన్నికలంటే కోట్ల రూపాయల వ్యవహారం అయిపోయింది. ఎంపిగా పోటీ చేయాలంటే తక్కువలో తక్కువ రూ. 100 కోట్ల ఖర్చుకు సిద్దపడాలి. సాధారణ ఎన్నికలైతే ఎంఎల్ఏల అభ్యర్ధులు కూడా కొంత ఖర్చు పెట్టుకుంటారు కాబట్టి ఎంపిల ఖర్చు కొంత తగ్గే అవకాశముంది. ఇపుడా ఆ అవకాశం కూడా లేదు. కాబట్టి మొత్తం ఖర్చంతా ఎంపి అభ్యర్ధులే భరించాలి. పైగా ప్రత్యేకహోదాపై ప్రజల్లో అంత సెంటిమెంటుందా అన్నదే ప్రశ్న. నిజంగానే ఆ స్ధాయి సెంటిమెంటు గనుక ఉంటే అభ్యర్ధులు గెలుపుకు అంతగా ఖర్చు పెట్టే అవసరం రాకపోవచ్చు. ఒకవేళ అనుకున్నంత సెంటిమెంటు గనుక లేకపోతే ఎంత ఖర్చు పెట్టినా గులుపు అనుమానమే.
చంద్రబాబుకు ప్రతిష్టాత్మకం
ఇక, టిడిపి పరిస్దితిని గమనిస్తే కాస్త గందరగోళంగానే ఉంది. హోదా సెంటిమెంటు ఉందో లేదో తెలీక టిడిపి నేతలు నానా టెన్షన్ పడుతున్నారు. నిజంగానే జనాల్లో సెంటిమెంట్ ఉంటే వైసిపి గెలుపును ఎవరూ ఆపలేరు. కాకపోతే అధికారంలో ఉండటం టిడిపికి ప్లస్ పాయింటే. ఎందుకంటే, అధికారంలో ఉన్న కారణంగా ఖర్చుకు వెనకాడాల్సిన అవసరం లేదు. అభ్యర్ధులను ఎంపిక చేయటం, ప్రచారం, ఖర్చులు పెట్టుకోవటం, ఎలక్షనీరింగ్ తదితరాలు మొత్తాన్ని చంద్రబాబే చూసుకుంటారు. ఎందుకంటే, టిడిపి గెలుపు చంద్రబాబుకు అత్యంత ప్రతిష్టాత్మకం.
బిజెపి, జనసేన ఏం చేస్తాయ్ ?
ఉప ఎన్నికలు వస్తే భారతీయ జనతా పార్టీ, జనసేన ఏం చేస్తాయన్న విషయంలో స్పష్టత లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న కారణంగా బిజెపికి ఆర్ధిక వనరులకు కొదవ లేకపోవచ్చు. మరి, జనసేన పరిస్ధితే అర్ధం కావటం లేదు. ఉప ఎన్నికలు వస్తే అసలు బిజెపికి అభ్యర్ధులు దొరుకుతారా అన్నది కూడా పెద్ద ప్రశ్న. ఎందుకంటే, ఎవరో ఒకరిని అభ్యర్ధిగా పెట్టటం వేరు, మిగిలిన అభ్యర్ధులకు ధీటుగా పోటీ పడతారన్న స్ధాయిలో ఉండటం వేరు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనుకుంటున్న బిజెపికి ఈ ఉప ఎన్నికలు ట్రైలర్ లాగ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. జనసేన విషయం చూస్తే ఉప ఎన్నికల్లో పోటికి దిగే అవకాశాలు తక్కువనే అనిపిస్తోంది. మరి, పోటీ పెట్టనపుడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏం చేస్తారో చూడాలి. మొత్తం మీద ఉప ఎన్నికలు గనుక వస్తే అన్నీ పార్టీలకు లాభ, నష్టాలు సమానంగానే ఉన్నాయనే చెప్పాలి. ఇక, కాంగ్రెస్, వామపక్షాలది బహుశా నామమాత్ర పాత్ర అనే చెప్పాలి.