నానాటికి దేశంలో ఆడవాళ్ళకు రక్షణ కరువవుతుంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా, ఎన్ని చట్టాలు రూపొందించినా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచదేశాలను పరిశీలించి చూస్తే ఆడవాళ్ల మీద జరిగే దాడుల్లో భారత్ మొదటి 15 స్థానాల్లోపు ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అంచనావేయవచ్చు.
తాజాగా బెంగళూరు లో ఒక క్యాబ్ డ్రైవరు ఒక యువతి పట్ల చేసిన నిర్వాకం ఆమెను భయబ్రాంతులకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే బెంగళూరుకు చెందిన మహిళా ఆర్కిటెక్ట్ గతవారం ముంబై ప్రయాణ నిమిత్తం క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్కు బయలుదేరింది. దారిలో కారు మళ్లించిన డ్రైవర్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కారు డోర్లు బిగించి , ఆమె ఫోన్ లాక్కుని తాను చెప్పినట్లు వినకపోతే తన స్నేహితులను పిలిచి గ్యాంగ్ రేప్ చేస్తానని భయపెట్టాడు.
ఆమెను నగ్నంగా ఫోటోలు తీసి ఈ విషయం బయటికి చెబితే ఆ ఫోటోలను ఫేస్బుక్లో పెడతానని బ్లాక్ మెయిల్ చేసి చివరికి ఆమెను ఎయిర్పోర్ట్లో వదిలేసి వెళ్లిపోయాడు. అతని బారీ నుండి బయటపడ్డ ఆమె ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అతని కోసం గాలించి పట్టుకొని అరెస్ట్ చేశారు. కాగా ఈ ఘటనపై సదరు క్యాబ్ సంస్థ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. అతన్ని ఉదోగ్యం నుండి తీసేసి సంస్థాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ప్రకటించింది.