ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఐదుగురు వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాల అంశం రాజకీయాలను రక్తికట్టిస్తున్నాయి. వైసీపీ-బీజేపీ కాలయాపన కహానీ అదిరిపోతోంది. సాధారణంగా లోక్సభ తొలి సమావేశం జరిగిన తర్వాత కాల పరిమితి సమయం ఏడాదికన్నా తక్కువగా ఉంటే.. ఉప ఎన్నికలు రావని ఎన్నికల సంఘం వర్గాలు అంటున్నాయి. ఈ లెక్క చూసుకునే వైసీపీ-బీజేపీ కాలయాపన నాటకానికి తెరలేపాయి. ఒకసారి మనమూ లెక్కలను చూస్తే అసలు విషయం తెలుస్తుంది. 16లోక్ సభ తొలిసమావేశం జూన్ 4, 2014న జరిగింది.
ఇక వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, మిథున్రెడ్డి, అవినాశ్రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ప్రభాకర్రెడ్డి భేటీ జూన్ 6 2018న స్పీకర్ సుమిత్రా మహాజన్ను కలిసి తమ రాజీనామాలను ఆమోదించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే రాజీనామాలు చేస్తున్నట్లు మళ్లీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని వైసీపీ ఎంపీలకు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సూచించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... రాజీనామాలపై పునరాలోచించుకోవాలని ఎంపీలకు సూచించానని, రాజీనామాలకు కట్టుబడి ఉంటామని వారు చెప్పడంతో మరోసారి ధ్రువీకరణ లేఖలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
లేఖలు ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. మరోవైపు వైసీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ.. సభాపతి కోరిన మేరకు మళ్లీ ధ్రువీకరణ లేఖలు ఇచ్చామని తెలిపారు. రాజీనామాలను ఆమోదించాల్సిందేనని విజ్ఞప్తి చేశామని చెప్పారు. రాజీనామాలు చేసిన తర్వాత వ్యూహాత్మకంగానే రెండు నెలలపాటు కాలయాపన చేశారని పలువురు నాయకులు అంటున్నారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు చివరి రోజైన ఏప్రిల్ 6వ తేదీన ఐదుగురు వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి, ఆమరణ దీక్షలకు పూనుకున్నారు.
ఆ తర్వాత కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ ఎంపీలు యడ్యూరప్ప, బీ శ్రీరాములు చేసిన రాజీనామాలను స్పీకర్ వెంటనే ఆమోదించారు. ఈనేపథ్యంలోనే వైసీపీ ఎంపీల రాజీనామాలకు ఎందుకు ఆమోదించడం లేదనీ, బీజేపీ-వైసీపీ మధ్య ఏర్పడిన అవగాహన మేరకే ఇలా నాటకం ఆడుతున్నారనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మే 29న మరోసారి వైసీపీ ఎంపీలు స్పీకర్ను కలిశారు. తాజాగా.. జూన్ 6న మరోసారి భేటీ అయ్యారు. అయితే ఇదంతా.. ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేదని.. అన్ని లెక్కలు సరిచూసుకున్న తర్వాతనే ఈ భేటీ జరిగిందనే టాక్ వినిపిస్తోంది.