పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ పై తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల దాడిలో జగన్ కు గాయాలయ్యాయి. అదే సమయంలో జగన్ తో నడుస్తున్న వారితో పాటు వ్యక్తిగత సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. జగన్ కుడిచెయ్యి, కన్ను, మెడపై తేనెటీగలు బాగా కుట్టేశాయి. గురువారం ఉదయ కానూరు క్రాస్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా పక్కనే ఉన్న చెట్లపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయటంతో అందరూ బిత్తరపోయారు. ఎవరో చెట్టుపై ఉన్న తెనెతుట్టెను రాయితో కొట్టటంతో వెంటనే ఈగలు గుంపుపై దాడి చేశాయి. తేనెటీగల దాడిని ఏ విధంగా నిలువరించాలో ఎవరికీ అర్ధం కాలేదు. అందరూ చూస్తుండగానే తేనెటీగలు పాదయాత్రలోని అందరిపైనా మూకుమ్మడిగా దాడి చేశాయి. దాంతో చాలా మందికి గాయాలయ్యాయి. తీవ్రగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. జగన్ సిబ్బంది మాత్రం కర్చీఫ్ లతో తేనెటీగలను తోలుతున్నారు. అయితే, తనకు కూడా గాయాలైనా జగన్ మాత్రం పాదయాత్రను ఆపకుండానే ముందుకు సాగిపోయారు.