చంద్రబాబునాయుడుకు గల్లా కుటుంబం త్వరలో షాక్ ఇవ్వనున్నదా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. చాలా కాలంగా చంద్రబాబుపై అలిగిన గల్లా అరుణకుమారి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గానికి సిఎం వచ్చినపుడు కూడా ఆమె హాజరుకావటం లేదు. కాంగ్రెస్ హయాంలో చంద్రగిరిలో మూడు సార్లు గెలవటమే కాకుండా పదేళ్ళపాటు మంత్రిగా చక్రం తిప్పిన అరుణకుమారి మాట ఇపుడు చెల్లుబాటు కావటం లేదు. రాష్ట్ర విభజన నేపధ్యంలో 2014లో టిడిపిలో చేరినా పెద్దగా ఉపయోగం కనబడలేదు.కొడుకు గుంటూరు ఎంపిగా గెలవటమొక్కటే గల్లా కుటుంబానికి ఊరట.
పార్టీ కార్యక్రమాలకు దూరంగా
సరే ఇక ప్రస్తుతానికి వస్తే ఎంఎల్ఏగా చంద్రగిరిలో గల్లా ఓడిపోయి టిడిపి అధికారంలోకి వచ్చినా ఆమె మాట ఎక్కడా చెల్లుబాటు కావటం లేదట. రేషన్ కార్డు, ఇంటి స్ధలం, ఇల్లు, పెన్షన్ లాంటివి మంజూరు చేయాలని ఆమె సిఫారసు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదట. దాంతో అలిగిన అరుణకుమారి పార్టీకే దూరంగా ఉంటున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి భవిష్యత్ కార్యాచరణపై రెండు రోజుల క్రితమే గల్లా తన మద్దతుదారులతో నియోజకవర్గంలో సమావేశమయ్యారు.
టిడిపికి గెలుపు అవకాశాలు లేవా ?
మర్యాద, గౌరవం లేనపుడు టిడిపిలో ఉండాల్సిన అవసరం లేదని మద్దతుదారులు తెగేసి చెప్పారట. ఆ సందర్భంగా అరుణకుమారి మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సంక్షేమ పథకాలకు ఎంతో ప్రాధన్యం ఉండేదన్నారు. ప్రజలకు మంచి చేయటంలో ఎంతో స్వతంత్య్రం ఉండేదన్నారు. సంక్షేమపథకాలకు దూరమైన టిడిపి వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని చెప్పారట.
ఎన్నికలకు ముందు నిర్ణయం ?
విషయం ఏమిటంటే, గల్లాకే కాదు చంద్రబాబుకు కూడా చంద్రగిరి సొంతూరే. దశాబ్దాల పాటు చంద్రబాబు, గల్లా కుటుంబాలు ప్రత్యర్ధులుగానే ఉండేవి. కాకపోతే గల్లా టైం బాగోలేక, వేరేదారి లేక టిడిపిలో చేరాల్సొచ్చింది. అయితే, క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు నియోజకవర్గంలో టిడిపికి అనుకూలంగా లేవు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలో అర్ధం కావటం లేదు. అదే విషయమై ఎంపి గల్లా జయదేవ్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు నిర్ణయం తీసుకుందామని చెప్పారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. చూడబోతే చంద్రబాబుకు గల్లా కుటుంబం షాక్ ఇచ్చేట్లుగానే ఉంది.