పోయిన ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీని బాగా ఆధరించిన జిల్లాల్లో అనంతపురం జిల్లాది రెండో స్ధానం. జిల్లాలోని మొత్తం 14 నియోజకవర్గాల్లో తెలుగుదేశంపార్టీ దాదాపు ఏకపక్షంగా 12 సీట్లలో విజయం సాధించింది. అందుకే జిల్లాలోని అనంతపురం, హిందుపురం పార్లమెంటు స్ధానాల్లో కూడా టిడిపి అభ్యర్ధులే గెలిచారు. అటువంటిది వచ్చే ఎన్నికల్లో టిడిపి సీన్ రివర్స్ అవుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అందరిలోనూ ఇటువంటి అనుమానాలు రావటానికి టిడిపి నేతల స్వయంకృతమనే చెప్పాలి. పోయిన ఎన్నికలకు ముందు పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి తమలోని విభేదాలన్నింటినీ పక్కనపెట్టి పోయిన ఎన్నికల్లో నేతలు పోరాడారు. అధికారంలోకి రాగానే మళ్ళీ ఆధిపత్యం కోసం కొట్టుకోవటం ఎక్కువైపోయింది. దానికితోడు కొత్త నీరు కూడా పార్టీలోకి వచ్చి చేరటంతో గొడవలు తారస్ధాయికి చేరుకున్నాయి.
గ్రూపు తగాదాలే కొంపముంచుతాయా ?
జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లోనూ గ్రూపు తగాదాలు బాగా పెరిగిపోయాయి. ప్రతీ మంత్రి పరిటాల సునీతతో మొదలుపెడితే చాలా మంది ఎంఎల్ఏలు, ఎంపిలకు సన్ స్ట్రోక్ కానీ సనిల్లా స్ట్రోక్ కానీ ఎక్కువైపోయింది. మంత్రి, ఎంఎల్ఏలు, ఎంపిల తరపున కొడుకులు, అల్లుళ్ళ పెత్తనం పెరిగిపోయింది. దాంతో అధికారులు లేకపోతే ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తల్లో వారిపై తీవ్ర అసంతృప్తి పేరుకుపోయింది. ప్రభుత్వంలో ఎటువంటి కాంట్రాక్టులు చేయాలన్నా, ప్రభుత్వం తరపున ఎటువంటి లబ్ది పొందాలన్నా ముందు మంత్రి, ఎంఎల్ఏలు, ఎంపిల కుటుంబ సభ్యులే తయారైపోతున్నారనే ప్రచారం బాగా ఎక్కువైపోయింది. దాంతో పార్టీ నేతలకు ఏమీ మిగలటం లేదు.
ఎంఎల్ఏలు, ఎంపిలపై వ్యతిరేకత
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ప్రజాప్రతినిధుల పెత్తనమే ఎక్కువైపోయింది. ప్రతీ అంశంలోనూ జన్మభూమి కమిటీలదే పెత్తనమైపోవటంతో అర్హులైన వారిలో అత్యధికులకు అన్యాయం జరుగుతోందన్న ప్రచారం ఎక్కువైపోయింది. దాంతో సామాన్య జనాలకు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ప్రజాప్రతినిధులకు జనాలకే కాకుండా క్యాడర్ తో కూడా గ్యాప్ పెరిగిపోయింది. అలాగే, కాంట్రాక్ట్ పనులు కూడా ప్రతిపక్షంలోని నేతలకే దక్కుతోందని ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా మంత్రులు, ఎంపిలతో పాటు ఎంఎల్ఏలపైన కూడా వ్యతిరేకత పెరిగిపోతోంది.
కుటుంబసభ్యులదే పెత్తనం
పార్టీ వర్గాల సమాచారం ప్రకారమే కల్యాణ దుర్గం ఎంఎల్ఏ హనుమంతరాయ చౌదరి కొడుకు మారుతిదే నియోజకవర్గంలో పెత్తనం. శింగనమల ఎంఎల్ఏ యామినీబాల, ఎంఎల్సీ శమంతకమణి తల్లీ, కూతుళ్ళన్న సంగతి అందరికీ తెలిసిందే. వారిద్దరి తరపున ఎంఎల్ఏ సోదరుడే వ్యవహారాలు చక్కపెట్టేస్తున్నారట. గుంతకల్ ఎంఎల్ఏ జితేందర్ గౌడ్ సోదరుడుదే నియోజకవర్గంలో పెత్తనం. పెనుకొండ ఎంఎల్ఏ బికె పార్దసారధి తరపున ఆయన అల్లుడే రాజ్యం చేస్తున్నారట. మంత్రి పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీరామ్ సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నందమూరి బాలకృష్ణ నియోజకవర్గం హిందుపురంలో పిఏదే పెత్తనం. హిందుపురం ఎంపి నిమ్మల కిష్టప్ప తరపున కొడుకులే రాజ్యం చేస్తున్నారు. కుటుంబసభ్యుల పెత్తనం పెరిగిపోవటంతోనే ద్వితీయశ్రేణి నేతలు, క్యాడర్ కు మండిపోతోంది.
జెసిల రూటే వేరు
జెసి బ్రదర్స్ అంటే తెలీని వాళ్ళుండరు. జిల్లాలో వాళ్ల రూటే వేరు. వాళ్ళ ధాటిని తట్టుకోవటానికి టిడిపి ఎంఎల్ఏల వల్ల కావటం లేదు. అనంతపురం పార్లమెంటు పరిధిలో ఎంపి జెసి దివాకర్ రెడ్డి, తాడిప్రతిలో ఎంఎల్ఏ జెసి ప్రభాకర్ రెడ్డితో టిడిపి ఎంఎల్ఏలు, నేతలకే తలనొప్పులు వస్తున్నాయ్. అనంతపురం పార్లమెంటు పరిధిలోని ఏడుగురు ఎంఎల్ఏలను ఎంపి దివాకర్ రెడ్డి బాగా కెలుకుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వాళ్ళకు బదులుగా తన మద్దతుదారులకు టిక్కెట్లు ఇప్పించుకోవాలన్నది ఎంపి ఉద్దేశ్యం. దాంతో ఎంపికి ఎంఎల్ఏలకు పార్టీల్లో రోజూ ఎంఎల్ఏలు, ఎంపిల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అసలే ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకతకు తోడు పార్టీల్లో పెరిగిపోతున్న గొడవల కారణంగా వచ్చే ఎన్నికల్లో టిడిపి సీన్ రివర్స్ అయినా ఆశ్చర్యం లేదని స్వయంగా టిడిపి నేతలే చెప్పుకుంటున్నారు.