ఏపీలో వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఎవరికి వారు తమ సిట్టింగ్ సీటులను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు తమ వారసుల కోసమో, వేరే సీటు కోసమో ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార టీడీపీలో సీట్ల కోసం గట్టి పోటీ నెలకొంది. సిట్టింగ్లకు ఎర్త్ పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కొందరు యంగ్ లీడర్లు కూడా సీట్ల కోసం తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏలూరు ఎంపీ సీటు కోసం మాజీ కేంద్ర మంత్రి, దివంగత బోళ్ల బుల్లి రామయ్య మనవడు బోళ్ల రాజీవ్ గురి పెట్టారు.
2014 ఎన్నికల్లోనూ రాజీవ్ ఏలూరు ఎంపీ సీటు కావాలని తన ప్రయత్నాలు తాను చేశారు. అయితే జిల్లాలో పార్టీ కోసం పదేళ్లుగా పని చేస్తూ వస్తోన్న మాగంటి బాబును పక్కన పెట్టేందుకు ఇష్టపడని చంద్రబాబు బాబుకే సీటు ఖరారు చేశారు. ఆ ఎన్నికల్లో అప్పటి వరకు కేంద్రమంత్రిగా ఉన్న కావూరు సాంబశివరావు సైతం సీటు ఇస్తే టీడీపీలోకి రావాలని ట్రై చేశారు. కావూరు కుమార్తె మనవడు బాలయ్యకు రెండో అల్లుడు కావడంతో కావూరు ఆ యాంగిల్లో ట్రై చేశారు.
అయితే చంద్రబాబు మాత్రం మాగంటి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వైనం గుర్తించడంతో పాటు ఆయన కమిట్మెంట్ నేపథ్యంలో ఆయనకే సీటు ఇవ్వడం ఆయన గెలవడం జరిగిపోయాయి.
ఇక వచ్చే ఎన్నికల్లో బాబు ఎంపీగా పోటీ చేయరని... ఆయన అసెంబ్లీకి వెళతారని... ఏలూరు ఎంపీ సీటు రాజీవ్కే అన్న ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. బాబు కైకలూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై మాగంటి గురువారం క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనని తెలిపారు. అసెంబ్లీకి పోటీ చేసి ఎవరినీ ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో కూడా మళ్లీ ఎంపీగానే పోటీ చేస్తానని మాగంటి బాబు వెల్లడించారు. బాబు ఎంపీ సీటు విషయంలో వెనక్కి తగ్గేది లేదని డిసైడ్ అయినట్టు ఆయన వ్యాఖ్యల్లో తెలుస్తోంది.
బాబు ఎంపీగానే వెళితే మరి ఎలాగైనా ఏలూరు ఎంపీగా పోటీ చేయాలని పట్టుదలతో ఉన్న యంగ్ లీడర్ రాజీవ్ పరిస్థితి ఏంటన్నది మాత్రం ప్రస్తుతానికి అయితే ప్రశ్నార్థకమే. బాబు మళ్లీ ఎంపీగానే వెళ్లాలని ఫిక్సైపోయారు. రాజీవ్ మాత్రం ఏలూరు ఎంపీ సీటు కోసమే పని చేస్తున్నారు. మరి వీళ్లిద్దరి మధ్య ఏలూరు టీడీపీ ఎంపీ సీటు కోసం దూబూచులాట స్టార్ట్ అయ్యింది. ఫైనల్గా చంద్రబాబు డెసిషన్ ఎలా ఉంటుందో ? చూడాలి.