ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రజలతో మమేకం అవుతూ..అధికారులతో టెలీకాన్ఫిరెన్స్ నిర్వహిస్తూ చంద్రబాబు దూకుడు పెంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పై మరోసారి విమర్శలు గుప్పించారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు . గత కొంత కాలంగా ఏపిలో సీఎం చంద్రబాబు పై ఘాటైన విమర్శలు చేస్తూ వస్తున్నారు సోము వీర్రాజు. తాజాగా నవ నిర్మాణ దీక్షల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు అసత్యాలను చెబుతూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు.
ఈ దీక్షల కారణంగా ఉద్యోగులంతా కార్యాలయాల్లో లేకపోవడంతో ప్రజా సమస్యలను పట్టించుకునేవారే కనిపించడం లేదని అన్నారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పారు. కుమారుడు నారా లోకేష్ ను ముఖ్యమంత్రిని చేసి, తాను ప్రధాని కావాలని చంద్రబాబు భావిస్తున్నారని సోము వీర్రాజు తెలిపారు. మోదీని దేశ ప్రధానిగా ప్రజలు ఎన్నుకున్నారని... చంద్రబాబు ప్రధాని కావాలని ఎప్పుడూ, ఎవరూ అనుకోలేదని చెప్పారు.
2014లో బీజేపీ, జనసేనల వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని అన్నారు.మొన్నటి వరకు మిత్రపక్షంగా ఉన్నప్పటికీ... రాష్ట్రంలో బీజేపీ గెలుపు కోసం టీడీపీ ఎన్నడూ సహకరించలేదని మండిపడ్డారు. చంద్రబాబు లాంటి కుట్రపూరిత రాజకీయ నాయకుడు మన దేశంలో ఇంకెవ్వరూ లేరని అన్నారు. ఏపీలో బీజేపీ చేస్తున్న అభివృద్ధిని టీడీపీ నేతలు ఓర్వలేక పోతున్నారని విమర్శించారు.