జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పీడ్ పెంచారు. ప్రజా పోరాట యాత్ర పేరుతో రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. ప్రభుత్వంపై వాడీవేడి విమర్శలు చేస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళుతున్నాడు. 2019లో జనసేన అధికారంలోకి వస్తుందని బలంగా ప్రచారం చేస్తున్నాడు. ఇదే సమయంలో జనసేనాని చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 175 స్థానాల్లో బరిలోకి దిగుతామని చెబుతున్న పవన్.. వచ్చే ఎన్నికల్లో జనసేన తొలి గెలుపు ఎక్కడి నుంచి మొదలవుతుందో కూడా ప్రకటించేశాడు. తాను ఎక్కడి నుంచి పోటీచేస్తాడనే విషయంపై క్లారిటీ ఇవ్వకపోయినా.. జనసేనను గెలిపించే తొలి నియోజకవర్గాన్ని మాత్రం చెప్పేశాడు. విశాఖ జిల్లాలోకి పాయకరావు పేట నుంచే జనసేన విజయం ప్రారంభమవుతుందని పవన్ జోస్యం చెప్పాడు. ఈ సంచనల వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.
ఇచ్ఛాపురం నుంచి ప్రారంభించిన ప్రజా పోరాట యాత్రలో ప్రభుత్వంతో పాటు సీఎం చంద్రబాబుపై ఘాటైన విమ ర్శలు చేస్తున్నాడు జనసేనాని. అవినీతిలో కూరుకుపోయిందంటూ దుయ్యబడుతున్నాడు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేచ్చలేందంటూ.. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ అధికార పార్టీ నాయకులకు కునుకు లేకుండా చేస్తున్నాడు. అదే సమయంలో ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లేందుకు శక్తి వంచన లేకుండా కృషిచేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన సంచలన జోస్యం చెప్పారు. జనసేన పార్టీ గెలిచే మొదటి సీటు ఏదో పవన్ తాజాగా ప్రకటించారు. పాయకరావుపేటలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఇదే జనసేన గెలిచే మొదటి సీటు అని ప్రకటించారు. జనసేన పోరాట యాత్రకి స్వాగతం పలికే ఫ్లెక్సి కడుతూ శివ, నాగరాజు అనే ఇద్దరు కార్యకర్తలు మృత్యువాతపడిన విషయం తెలిసిందే. వారి కుటుంబాలను పవన్ పరామర్శించాడు.
అనంతరం నిర్వహించిన సభలో పవన్ మాట్లాడుతూ పాయకరావుపేట అంటే ముందుగా గుర్తుకు వచ్చేది రాయవరం గ్రామమన్నారు. గురజాడ అప్పారావు గారు జన్మించిన నేలపై జూనియర్ కాలేజీ లేకపోవడం దురదృష్టకరమన్నాడు. విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇక్కడ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, అది ఏమైందో తెలియదంటూ మండిపడ్డాడు. 2014 ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకున్నప్పుడు పాయకరావుపేట నియోజకవర్గం కూడా అందులో ఉందని, కానీ సమస్యలను అర్థం చేసుకుని జనసేన ముందుకు వెళ్లిందన్నారు. 2019 ఎన్నికల్లో పాయకరావుపేట జనసేనదే అవుతుందని సంచలన ప్రకటన చేశారు. అల్లూరి సీతారామరాజు తిరిగిన నేల ఇదని, కళింగాంధ్రను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయన్నారు.
ముఖ్యమంత్రి గారికి అమరావతి అభివృద్ధి తప్ప పాయకరావు పేట అభివృద్ధి అవసరం లేదని పవన్ ఎద్దేవా చేశారు. `అమరావతిలో యూనివర్శిటీలకు వందలాది ఎకరాలు ధారదత్తం చేస్తారు.. ఇక్కడ కాలేజీలు, ఆస్పత్రులని మాత్రం పట్టించుకోరు. ఉత్తరాంధ్రలో స్వచ్ఛ భారత్ లో కూడా అవినీతి రాజ్యం ఏలుతోంది. హెటిరో కంపెనీ వారు వ్యర్థ పదార్థాలను సముద్రంలోకి వదలడం వల్ల పలు గ్రామాల్లో మత్యకారులకు నష్టం కలుగుతోందన్నారు. అమరావతిలో యూనివర్సిటీలకు ధారాదత్తం చేశారని కానీ పాయకరావుపేటలో ఒక్క డిగ్రీ కళాశాల ఇచ్చేందుకు ఆ గంటా శ్రీనివాస రావు మిగతా టీడీపీ నేతలు వెనుకాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అంటారు కానీ పాయకరావు పేటలో ఆసుపత్రిని అరవై పడకలకు మార్చకపోవడం చేతగానితనమంటూ ఘాటైన విమర్శలు చేశారు.