ఏపీ సీఎం చంద్రబాబు గురించి క్లారిటీ ఉండడం అంటే మాటలు కాదు. దాదాపు 40 ఏళ్లుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఉన్నవారిలో దాదాపు సగానికి పైగా ఈయనకు ముందు జూనియర్లే. ఇక, పాలనానుభవంలోనూ దాదాపు అంతే పరిస్థితి! మరి అలాంటి నాయకుడిని బీజేపీ తక్కువ అంచనా వేసిందా? బీజేపీ ఆయనను ఏం చేస్తాడులే అని భావించిందా?! అంటే మొదట్లో అయితే, ఔననే చెప్పాలి. కానీ, ఇప్పుడు ఏపీలో బీజేపీ.. పరిస్థితి నానాటికీ తీసికట్టులా తయారయ్యే సరికి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో బీజేపీ నేతలు చిక్కుకుపోయారు. ఒక్కసారిగా వారు ఊహించని విధంగా ఏపీలో మరో కాంగ్రెస్ పరిస్థితిని చేజేతులా కొనితెచ్చుకున్నారు. మరిఇలాంటి పరిస్థితిని సృష్టించుకున్న నాయకులు తాజాగా నోరు విప్పారు. తమకు బాబు పరిస్థితి తెలిసివచ్చిందని చెప్పకనే చెప్పారు.
వాస్తవానికి 2014నాటి ముందు పరిస్థితిని తీసుకుంటే.. కాంగ్రెస్కు, బీజేపీకి పెద్దగా తేడా లేదు. కాంగ్రెస్ నేరుగా రాష్ట్ర విభజన చేసింది. అదేసమయంలో రాష్ట్ర విభజనకు బీజేపీ పట్టుబట్టింది. బీజేపీ నేత ఎంపీ సుష్మాస్వరాజ్ దగ్గరుండి మరీ కేసీఆర్ను అప్పటి స్పీకర్ వద్దకు తీసుకు వెళ్లి.. రాష్ట్ర విభజన అంశాన్ని చర్చించాలని, తాము మద్దతిస్తామని చెప్పారు. దీంతో రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ ఎంత కృషి చేసి చక్రంతి ప్పిందో అంతే విధంగా బీజేపీ కూడా తిప్పింది. అయినప్పటికీ.. అప్పటి ఎన్నికలలో చంద్రబాబు.. ఆ పార్టీతో చెలిమి చేశారు. అది కూడా మోడీ హవా ఉద్రుతంగా వీస్తుండడంతో బాబు ఆయన ద్వారా ఏపీకి న్యాయం జరుగుతుందని ఆయన భావించారు. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా మోడీని కలిసి ఏపీ సమస్యలను వివరించారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. అప్పటి వేడిలో ఇస్తానన్న మోడీ.. తర్వాత ప్లేట్ ఫిరాయించారు. హోదా ఇస్తే.. అందునా అపరచాణిక్యుడైన చంద్రబాబు సీఎంగా ఉన్న రాష్ట్రానికి హోదా వస్తే.. తన సొంత రాష్ట్రం గుజరాత్నే మించిపోతుందని భయపడ్డారు. ఇదే జరిగితే.. దాదాపు 20 ఏళ్లుగా గుజరాత్ వికసిస్తున్న కమలం వాడిపోతుందని అనుకున్నారు. ఈ క్రమంలోనే ఏపీకి హోదా లేదని ప్రకటించారు. అయినా బాబు సహించారు. ప్యాకేజీ ఇస్తామంటే.. ఏపీ ప్రజలు అలాగైనా సంతృప్తి చెందుతారని భావించారు. అది కూడా ఇచ్చేందుకు మోడీ నిరాకరించారు. ఈ క్రమంలోనే బాబు తన విశ్వరూపం చూపించారు.
వాస్తవానికి తాము ఆడించినట్టు.. తమిళనాడులోని పళని ప్రభుత్వం మాదిరిగా బాబు ఆడతారని, ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వంలాగా భయపడతారని, పశ్చిమ బెంగాల్లోని మమత ప్రభుత్వంలా నాలుగు మాటలు తిట్టి ఊరుకుంటారని మోడీ, పార్టీ జాతీయ జాతీయ అధ్యక్షుడు షాలు భావించారు.కానీ, బాబు వ్యూహం అలా లేదు. ఏపీలో బీజేపీని కూకటివేళ్లతో సహా పెకలించేశారు. ఈ పోరు మరింత తీవ్రం చేయనున్నారు. దీంతో ఇప్పటికి కానీ, బీజేపీకి బాబు సత్తా తెలియరాలేదు. ఇప్పుడు ఇదే విషయంలో ఢిల్లీలో నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. బాబుతో పెట్టుకుని సర్వనాశనం అయ్యామని బాధపడుతున్నారు. ఏదేమైనా బాబు సత్తా తెలియడానికి బీజేపీకి చాలా సమయమే పట్టడం గమనార్హం.