విభజన కష్టాల నుంచి తేరుకుని నాలుగేళ్లు ప్రయాణించిన ఏపీలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ సమయంలో సీఎం చంద్రబాబు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. నవ్యాంధ్ర సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాతి నుంచి ఈ నాలుగేళ్లు చంద్రబాబు పాలన ఎలా ఉంది? ప్రజలు ఆయనకు ఎన్ని మార్కులు వేస్తారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుంది? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? అనే సందేహాలు అందరి లోనూ ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటిపై ఒక సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో ఏపీ సీఎం చంద్రబాబుకు దిమ్మ తిరిగే ఫలితాలే వచ్చాయట. ముఖ్యంగా అవినీతిని మరిచిపోయి తనకే పట్టం కట్టాలని బాబు పదేపదే కోరుకుంటున్నా.. ప్రజలు ఈసారి మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారని తేలింది. చంద్రబాబు మాటలను తాము నమ్మే స్థితిలో లేమని స్పష్టంగా చెప్పేశారు. ఫలితంగా బాబుకు ఈసారి ఎదురీత తప్పదనేది సర్వే సారాంశమట.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే అనుభవమే ముఖ్యమని ప్రజలు నమ్మారు. అందుకు తగినట్టుగానే రాష్ట్ర రూపురేఖలు మార్చేస్తామని.. టీడీపీ గెలుపు చారిత్రక అవసరమని 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఉపన్యాసాలు ఇచ్చారు. వాటిని బాగా బుర్రలోకి ఎక్కేలా చేశారు. నాలుగేళ్లు గిర్రున తిరిగిపోయాయి. మళ్లీ అవే మాటలు ఇప్పుడు కూడా చెబుతున్నారు. టీడీపీని గెలిపించకపోతే అభివృద్ధి ఆగిపోతుందని, తననే మళ్లీ గెలిపించాలంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నారు. గత ఎన్నికల్లో అనుభవం ఆయన్ను కాపాడినా.. ఈసారి మాత్రం అవేమీ ఆయన్ను రక్షించలేవంటున్నారు ప్రజలు. బాబు ఆ విధంగా ముందుకు వెళ్తుంటే, దీని ప్రభావం మాత్రం అంతగా లేదని చెబుతున్నాయి సర్వేలు. తాజాగా ఒక మీడియా సంస్థ చేసిన సర్వేలో ఇదే అంశం తేటతెల్లం అయ్యింది.
జాతీయ స్థాయిలో పేరెన్నిక గల ఆ సంస్థ చేసిన అధ్యయనంలో చంద్రబాబుకు షాకింగ్ ఫలితాలు వచ్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఎవరికి ఓటేస్తారు? అని ఆ సంస్థ అడిగిన ప్రశ్నకు 42 శాతం మంది జగన్ అని సమాధానం ఇచ్చారు. చంద్రబాబుకు ఓటేస్తామన్నది 30 శాతం మందే. పవన్ కల్యాణ్ వాటా 19 శాతంగా ఉంది. చంద్రబాబు అనుభవం ఏపీ డెవలప్మెంట్కు ఉపయోగిపడిందా? అంటే.. 59 శాతం మంది నో అని చెప్పారు. ప్రభుత్వ వ్యవహారాల్లో లోకేష్ జోక్యం పెరుగుతోందా? అనే ప్రశ్నకు 67 శాతం ఔను అన్నారు. హోదా సాధనలో బాబు ఫెయిలయ్యాడా? అంటే, 76 శాతం మంది ఏకగ్రీవంగా ఔను అన్నారు. చంద్రబాబు పాలనలో అవినీతి పెరిగిందా? అనే ప్రశ్నకు 60 శాతం మంది ఔనన్నారు. బాబు పాలన ఏమాత్రం బాగోలేదని 57 శాతం మంది తేల్చి చెప్పారట.