సాధారణ ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఎన్నికల్లో సంఖ్యాపరంగా మొదటిస్ధానంలో నిలిచేందుకు పార్టీలన్నీ వేటి వ్యూహాలు అవి రచించుకుంటున్నాయి. అందులో భాగంగా చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రావటం ఖాయమని తాను ముఖ్యమంత్రి అవ్వటం అంతకన్నా ఖాయంగా పవన్ అనుకుంటున్నట్లు ఆయన మాటల్లో అర్ధమవుతోంది. అయితే, క్షేత్రస్ధాయిలో రాజకీయ సమీకరణలు చూస్తుంటే జనసేనకు అంత సీన్ లేదన్న విషయం అర్ధమవుతోంది. కాకపోతే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విషయంలో మాత్రం జనసేన కీలకపాత్ర పోషించే అవకాశాల ఎక్కువే కనిపిస్తోంది.
జనసేన బలమెంత ?
అదెలాగంటే, ఇప్పటికైతే జనసేన 175 సీట్లలోనూ పోటీ చేస్తుందని పవన్ పదే పదే చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే జనసేన పోటీ చేసే సీట్ల సంఖ్య పై ఆపార్టీలోనే భిన్న వాదనలున్నాయనుకోండి అది వేరే సంగతి. సరే, జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందన్న విషయాన్ని పక్కనపెడితే ఎన్ని స్ధానాల్లో గెలుస్తుందన్న విషయమే చాలా కీలకం. ఇక్కడే మిగిలిన పార్టీలు వేటికవే జనసేన అంటే ఉలిక్కిపడుతున్నాయి. ఎందుకంటే, పోటీ చేసిన అన్నీ సట్లలోనూ గెలిచే సత్తా జనసేనకు లేకపోయినా చాలా సీట్లలో మిగిలిన పార్టీల గెలుపోటములను నిర్ణయించే స్ధాయి జనసేనకుందని అనుమానిస్తున్నారు. గట్టిగా చెప్పాలంటే జనసేన బలంపై ఏ పార్టీకి స్పష్టమైన అవగాహన లేదన్నది వాస్తవం. అందుకే అన్నీ పార్టీల్లో జనసేన అంటే కన్ఫ్యూజన్ ఉంది.
60 నియోజకవర్గాల్లో కాపులే నిర్ణయాత్మకమా ?
కాపు నేతల లెక్కల ప్రకారం ప్రస్తుతం 30 నియోజకవర్గాల్లో కాపు ఎంఎల్ఏలున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో కాపుల ప్రాబల్యం చాలా ఎక్కువ. పై జిల్లాలతో పాటు కోస్తాలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశంతో పాటు రాయలసీమలో కాపు (బలిజ)ల జనాభా ఎక్కువ. సుమారు 60 నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్ధి గెలవాలన్నా కాపుల ఓట్లే నిర్ణయాత్మకం. అభ్యర్ధుల గెలుపోటముల్లో ఇంతటి ప్రభావం చూపగలిగిన స్దితిలో ఉన్న కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తే పవన్ కల్యాణ్ అన్న విషయం ఎవరికీ చెప్పక్కర్లేదు.
కాపులే పవన్ లక్ష్యమా ?
తనను ఏ ఒక్క సామాజికవర్గానికో పరిమితం చేయొద్దని, తాను అందరి వాడినని పవన్ పైకి ఎన్ని మాటలు చెబుతున్నా కాపుల ఓట్లనే లక్ష్యంగా చేసుకున్న విషయం ఆచరణలో తెలిసిపోతోంది. రేపటి ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేయబోయే అభ్యర్ధుల్లో కూడా కాపులే ముందుంటారనటంలో సందేహం లేదు. కాపు నేతల అంచనా ప్రకారం ప్రతీ నియోజకవర్గంలోనూ వారి సామాజికవర్గం ఓట్లు సమారు 15 వేలుంటాయి. అంటే, నియోజకవర్గానికి సగటున 2 లక్షల ఓట్లుంటే అందులో కాపుల ఓట్లే 15 వేలుంటాయి. ఏ నియోజకవర్గంలో కూడా నూటికి నూరు శాతం ఓట్లు పోలుకావు. సగటున సుమారు 1.7 లక్షల ఓట్లు పోలైతే చాలా ఎక్కువ.
కాపులపైనే గెలుపోటములు
మొదటిసారి జనసేన ఎన్నికల్లోకి దిగుతోంది కాబట్టి కాపులు రెట్టించిన ఉత్సాహంతో ఓట్లు వేసే అవకాశాలు ఎక్కువ. ఈ పరిస్ధితుల్లో కాపుల ఓట్లన్నీ జనసేన అభ్యర్ధికే పడినా సదరు అభ్యర్ధికి గెలుపు అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఎందుకంటే, ఏ అభ్యర్ధి కూడా తన సామాజికవర్గం ఓట్లతోనే గెలవటం సాధ్యం కాదు. మరి అప్పుడేమవుతుంది ? అంటే, జనసేన అభ్యర్ధి గెలవలేకున్నా ఇతర అభ్యర్ధుల గెలుపోటములను శాసించే అవకాశం ఉంది. అంటే, చాలా నియోజకవర్గాల్లో ఇతర పార్టీల గెలుపోటములు జనసేనపైనే ఆధారపడుందన్నది స్పష్టమవుతోంది. ఈ లెక్కలన్నీ కూడా జనసేన ఒంటరిగా పోటీ చేస్తేనే సుమా ! ఒకవేళ పవన్ కల్యాణ్ గనుక వేరే పార్టీతో జట్టు కడితే సమీకరణలన్నీ మారిపోవటం ఖాయం. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.