ఏపీలో ప్రస్తుతం హామీల వరద పొటెత్తుతోంది. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి నేతా.. ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నారు. అధికార పార్టీ టీడీపీ నుంచి విపక్షం వైసీపీలు ఈ హామీల వరదను ఓ రేంజ్లో పారిస్తుంటే.. జనసేనాని పవన్ కూడా తానేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఆయన అదికారమే వద్దని చెప్పి.. ఇప్పుడు ఛాన్స్ ఇస్తే.. తాను ప్రజల తలరాతలు మారుస్తానని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఏపీలో ప్రజలకు హామీలిచ్చే నేతల సంఖ్య పెరిగిపోయింది. వీటికితోడు కాంగ్రెస్ ఏకంగా తమను గెలిపిస్తే... ప్రత్యేక హోదానే ఇస్తామని ప్రకటించింది. ఈ హామీల వరదలో ప్రజలు తడిసి ముద్దవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎవరిస్తున్న హామీల్లో నిలకడ ఉంది? ఎవరు తమహామీలను పూర్తిస్థాయిలో నెరవేస్తారు? ఎవరికి నిబద్ధత ఉంది? అనే కీలక అంశాలపై గత రెండు మూడు రోజులుగా చర్చలు సాగుతున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తే.. ప్రజల వ్యూహం ఎలా ఉంటుంది? అనే అంశాలపై విస్తృతంగా చర్చ సాగుతోంది. నిజానికి రాజకీయాల్లో నేతలు, పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు అనేక హామలను గుప్పిస్తుండడం ఇటీవల కాలంలో ఎక్కువగా మారిపోయింది. ముఖ్యంగా 1990ల కాలం నుంచి హామీల వరద పారుతోందని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. గతంలో పార్టీలను బట్టి ప్రజలు అభ్యర్థులను ఎన్నుకునేవారు. కానీ, 90ల కాలం నుంచి అభ్యర్థుల ప్రభావం కూడా పెరిగిపోయింది.
దీంతో నేతల హవా పెరిగింది. ఇక్కడి నుంచే పార్టీలు హామీల జోరు పెంచాయని సదరు అధ్యయనం తెలిపింది. దక్షిణాది విషయానికి వస్తే.. ఎన్నికల హామీల విషయంలో తమిళనాడు తర్వాతే ఏ రాష్ట్రమైనా అని చెప్పుకోకతప్పదు. ఈ రాష్ట్రంలో దివంగత సీఎం జయలలిత వర్సెస్ కరుణానిధిల మధ్య అధికార పోరు పెరిగిన సందర్బంలో తొలిసారిగా `ఉచిత` హామీలకు తెరలేచింది. ఇక, ఆ తర్వాత ఇది దేశంలోని చాలా రాష్ట్రాలకు పాకింది. ఉచిత టీవీలు, వాచీలు, చీరలు.. ఇంటి సామాగ్రి, వివాహం చేసుకుని ఆడపిల్లలకు తాళిబొట్లు .. ఇలా ఒకటేమిటి.. తమిళనాడు నుంచి పాకిన ఉచిత హామీలు ఎన్నికలను శాసిస్తున్నాయి.
ఏపీ విషయానికి వస్తే.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎన్నికల పోరు జరుగుతోంది. నేతలు ఎవరికి వారే తమకు అనుకూలంగా ప్రజలను మళ్లించుకునేం దుకు తహతహలాడుతున్నారు. ఈ క్రమంలోనే సామాజిక వర్గాల వారిగా వారిని విభజించి మరీ హామీలను గుప్పిస్తున్నారు. కార్పొరేషన్లను ఇప్పటికే ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు 2014లో ఇచ్చిన ఎన్నికల హామీల్లో నిజానికి అమలు చేయాల్సినవి చాలానే ఉన్నాయి. మరో పది మాసాల్లో ఎన్నికలు అనగా.. ఇప్పటికీ అన్న క్యాంటీన్లు, నిరుద్యోగ భృతి ప్రారంభం కాలేదు. ఇంకా ఇవి ప్రణాళిక స్థాయిలోనే ఉండడ గమనార్హం. ఇక, బీసీలకు రూ.10 వేల కోట్లు ఇస్తానని చెప్పిన బాబు.. ఈ విషయంలోనూ చతికిల పడ్డారు. అదేవిధంగా కాపు రిజర్వేషన్ తీరని కలగానే మిగిలిపోయింది.
ప్రత్యేక హోదా విషయం ఎంత చెప్పుకొన్నా.. తక్కువే. ఇక, వైసీపీ విషయానికి వచ్చినా.. ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏడాది కిందట నవరత్నాలు పేరుతో ప్రతి ఒక్కరికీ లబ్ధి అని జగన్ చెప్పుకొచ్చారు. జగన్ చేసిన ప్రకటనల మేరకు హామీలను అమలు చేయాలంటే.. 100 లక్షల కోట్ల బడ్జెట్ కూడా సరిపోదని విశ్లేషకుల ఉవాచ. మరి ఇవన్నీ అమలయ్యే హామీలేనా? అంటే.. నిజానికి చెప్పుకొంటే.. ఇవన్నీ ఉత్తుత్తి హామీలుగానే మిగిలిపోవడం ఖాయం. టీడీపీ కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ ఎవరు అధికారంలోకి వచ్చినా.. ఏపీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దనిదే హామీలను అమలు చేయడం కష్టం!! మరి దీనిని బట్టి ప్రజలు ఓటు ఎవరికి వేస్తారో చూడాలి.