రాష్ట్రంలో బలమైన సామాజికవర్గమైన బిసిల మద్దతు కోసం వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లు కనబడుతోంది. రాష్ట్ర జనాభాలో బిసి సామాజికవర్గం జనాభానే ఎక్కువన్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా బిసిలు బాగా ఎక్కువ. అందులోనూ మొత్తం 175 సీట్లలో ఒక్క ఉభయ గోదావరి జిల్లాల్లోనే 34 నియోజకవర్గాలన్నాయి. అందుకనే జగన్ బిసిల సామాజికవర్గంపై గురి పెట్టినట్లు స్పష్టం ఆర్ధమవుతోంది. ఆ విషయాన్ని పక్కనపెడితే తెలుగుదేశం పార్టీ ఆయువుపట్టే బిసిలు. పార్టీ పెట్టినప్పటి నుండి బిసిలు టిడిపి వెన్నంటే ఉన్నారు. దాన్నిబట్టే రాష్ట్ర రాజకీయాల్లో బిసిలకున్న ప్రాధాన్యత అర్ధమవుతోంది. బిసిలను టిడిపికి దూరం చేస్తేగానీ తనకు అధికారం వచ్చే అవకాశాలు లేవన్న విషయాన్ని జగన్ గ్రహించినట్లున్నారు.
బిసిలను దూరం చేయటం టార్గెట్
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావటమన్నది జగన్ కు చావో రేవో అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకని అవసరమైన ఏ ఒక్క అంశాన్ని కూడా జగన్ వదులుకోదలచుకోలేదు. అందులో భాగంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ విషయంపైన కూడా బాగా దృష్టి పెట్టారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను ఉపయోగించుకుంటున్నది కూడా అందుకే. అందుకనే నియోజకవర్గాల్లో కులాల వారీగా జనాభా లెక్కలు తీశారు. ఇప్పటి వరకూ జగన్ ప్రకటించిన కొందరు అభ్యర్ధులను కులాల లెక్కలు భేరీజు వేసుకునే ప్రకటించారు. రాష్ట్ర జనాభాలో కూడా బిసిలే ఎక్కువ. కాకపోతే దామాషాతో పోల్చుకుంటే చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం తక్కవనే చెప్పాలి.
రాజమండ్రి ఎంపి సీటులో బిసి జనాభానే ఎక్కువ
తాజాగా రాజమండ్రి లోక్ సభ స్ధానాన్ని బిసిలకు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఎంపి సీటులో బిసి అభ్యర్ధిని ఎంపిక చేస్తానని జగన్ ప్రకటించినప్పటి నుండి సామాజికవర్గాల్లో ఒక విధంగా సంచలనం మొదలైంది. ఎందుకంటే రాజమండ్రి పార్లమెంటు స్ధానంలో ఏ పార్టీ కూడా ఇప్పటి వరకూ బిసిలకు అవకాశం ఇచ్చిందే లేదు. విచిత్రమేమిటంటే నియోజకవర్గం పరిధిలో బిసిల జనాభానే ఎక్కువైనా పోటీ చేసింది మాత్రం కమ్మ, కాపు, బ్రాహ్మణ క్షత్రియులే. ఈ విషయంలో బిసిల్లో ఎప్పటి నుండో అసంతృప్తి ఉన్నా ఏమీ చేయలేకపోతున్నారు. తమకు పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయటం తప్ప చేయగలిగిందేమీ లేదు.
నియోజకవర్గం మొత్తం మీద సుమారు 16 లక్షల ఓటర్లుంటే అందులో దాదాపు సగం బిసి ఓటర్లే. అందులోనూ గౌడ్లు, శెట్టి బలిజల ఉపకులాలు చాలా ఎక్కువ. జనాభాలో కొప్పుల వెలమ, పద్మశాలి, తూర్పుకాపు, రజకులు, ముస్లింలు తర్వాత ఉంటారు. వీరుకాకుండా ఎస్సీలు, కాపులు, కమ్మలు, బ్రాహ్మణులు, క్షత్రియులు, రెడ్లు, ఎస్టీలు కూడా ఉన్నారు.
ఉభయ జిల్లాల్లోనూ ప్రభావం
జగన్ చెప్పినట్లు ఎంపి స్ధానంలో గట్టి బిసి అభ్యర్ధిని నిలబెడితే దాని ప్రభావం పొరుగునే ఉన్న కాకినాడ లోక్ సభ తో పాటు పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, నరసాపురం పార్లమెంటు స్ధానాల్లో కూడా కనబడుతుంది. అసెంబ్లీ స్ధానాల సంగతి గురించి చెప్పనే అక్కర్లేదు. టిడిపి నుండి బిసిలను దూరం చేయాలంటే ఇదొక్కటే జగన్ కున్న మార్గం. అందుకనే తాను కూడా బిసిలకు పెద్ద పీట వేస్తున్నారు. మరి, జగన్ ప్లాన్ ఎంత వరకూ వర్కవుటవుతుందో చూడాలి ?