భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హత్య కు కుట్ర జరిగిందా ? అవుననే అంటున్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆమధ్య అమిత్ షా తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు గుర్తుందా ? వెంకటేశ్వరస్వామి దర్శనం తర్వాత బయటకు వచ్చినపుడు అమిత్ కాన్వాయ్ పై హటాత్తుగా దాడి జరిగింది. ఆ దాడి గురించే ఇపుడు కన్నా తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం విజయవాడలో జరిగిన బిజెపి పదాధికారుల సమావేశంలో కన్నా మాట్లాడుతూ, తిరుమల పర్యటన సందర్భంగా అమిత్ షా హత్యకు కుట్ర జరిగినట్లు చెప్పటం సంచలనంగా మారింది.
హత్య కుట్ర జరిగిందని చెబుతున్న కన్నా ఎవరు చేశారో మాత్రం నేరుగా చెప్పలేదు. ఎందుకంటే, అమిత్ షా కాన్వాయ్ పై దాడి చేసింది తెలుగుదేశంపార్టీ నేతలే. కాబట్టి హత్య కుట్ర కూడా టిడిపినే చేసిందనే రీతిలో కన్నా ఆరోపణలుండటం గమనార్హం. అందుకు మరో కారణాన్ని కూడా కన్నా చెబుతున్నారు. తమ జాతీయ అధ్యక్షునిపై జరిగిన దాడిలో పోలీసులు తమ నేతలపైనే కేసులు పెడుతున్నట్లు కూడా ఆరోపించారు. టిడిపి నేతలు దాడి చేసినా తమ నేతలను అదుపులోకి తీసుకోవటమేంటని కన్నా మండిపడుతున్నారు.
అసలు నాలుగేళ్ళ పాటు చంద్రబాబుతో కలిసి ఉండటమే తమ ఖర్మగా చెబుతున్నారు. చంద్రబాబు గురించి తెలీకుండానే మోడి, అమిత్ లు పొత్తులు పెట్టుకున్నారట. నాలుగేళ్ళ చంద్రబాబు పాలనంతా అవినీతిమయమే నంటూ కన్నా మండిపడ్డారు. తన అసమర్ధతను బిజెపిపై రుద్దేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు కూడా ధ్వజమెత్తారు.
విశాఖ ఎంఎల్ఏ విష్ణకుమార్ రాజు మాట్లాడుతూ, రోజుకు కోటి రూపాయల ఇసుక అక్రమ రవాణా జరుగుతోందంటూ మండిపడ్డారు. పాలనంతా అవినీతిమయమైపోయిందంటూ రాజు కూడా ధ్వజమెత్తారు. నాలుగేళ్లల్లో కేంద్రమిచ్చిన సహాయాన్ని చంద్రబాబు ఉపయోగించుకోలేకపోయినట్లు చెప్పారు. మొత్తం మీద బిజెపి చంద్రబాబుపై పూర్తిస్ధాయి యుద్దమే ప్రకటించినట్లు కనిపిస్తోంది. బిజెపిపై చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాన్ని జనాలు నమ్మరన్న ధీమా వ్యక్తం చేశారు. ఎందుకంటే, వాస్తవాలేంటో జనాలకు తెలుసట.