ప్రతిపక్షాల్లోని ఇద్దరు నేతలకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం షాకింగ్ ప్రతిపాదనలు పంపారు. ఇంతకీ ఏంటా ప్రతిపాదన అని అనుకుంటున్నారా ? అదేనండి చంద్రబాబు వ్యతిరేకంగా వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇద్దరు కలవాలంటూ ప్రతిపక్ష నేతలకు ముద్రగడ బహిరంగ లేఖ రాశారు. ఇంతకీ వారిద్దరూ ఏకం కావాల్సిన అవసరం ఏమిటంటే ? రాజధాని భూములు తన తండ్రి, తాతల నుండి వచ్చిన ఆస్తుల్లాగ చంద్రబాబు సింగపూర్ కు రాసిచ్చేస్తున్నారట. ప్రజల ఆస్తులను చంద్రబాబు తన ఆస్తిలాగ సింగపూర్ కంపెనీలకు రాసివ్వటాన్ని ముద్రగడ తప్పపట్టారు. నిత్యం కష్టాలతో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి వారిని మరిన్ని కష్టాల్లోకి నెడుతున్నట్లు ఉద్యమనేత ఫీలయ్యారు.
సింగపూర్ పాలిత ప్రాంతమేనా ?
రాష్ట్రాన్ని చంద్రబాబు సింగపూర్ పాలిత రాష్ట్రంగా మార్చాలని కుట్ర పన్నుతున్నట్లు మండిపడ్డారు. రాష్ట్రాన్ని, రైతులను, సామాన్య ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ముద్రగడ అభిప్రాయపడ్డారు. అందుకు జగన్, పవన్ ఒక వేదికను ఏర్పాటు చేసి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏకమవ్వాలంటూ సూచించారు. సూచన చేసిన ముద్రగడే అందుకు నడుంకడితే సరిపోయేదిగా ? ఎవరొద్దన్నారు ?
చంద్రబాబు కు వ్యతిరేకంగా జగన్, పవన్ ఏకమవ్వాలి
సింగపూర్ తో ఒప్పందాలు చేసుకున్న జూన్ 7వ తేదీని ముద్రగడ చీకటిరోజుగా అభివర్ణించారు. ఎందరో ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేస్తేనే దేశం పరాయిపాలన నుండి విముక్తి పొందిన విషయాన్ని మరచిపోయినట్లున్నారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు వల్ల సింగపూర్ పాలన నుండి బయటపడేందుకు ఇంకో పోరాటం చేయాల్సుంటుందని హెచ్చరించారు. బ్రిటీష్ వారిని దేశం నుండి తరిమికొట్టటానికి ఎలా అందరూ ఏకమయ్యారో ఇపుడు సింగపూర్ ను తరిమికొట్టటానికి కూడా మళ్ళీ అందరూ ఏకం కావల్సిన సమయం వచ్చిందని పిలుపిచ్చారు. జగన్, పవన్ ఇద్దరూ వామపక్షాలను కలుపుకుని పోరాటం చేస్తే పోరాటంలో కలిసేందుకు తనలాంటి వాళ్ళు ఎందరో సిద్దంగా ఉన్నట్లు కూడా ముద్రగడ లేఖలో పేర్కొనటం గమనార్హం.