విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు పుట్టిన రోజు నాడు కడుపు కాల్చుకోవాలని నిర్ణయించారు. ఇంతకీ విషయం ఏమిటంటే, మంగళవారం అయన పుట్టిన రోజు. ఆ రోజున అనకాపల్లి లో అన్న పానాలు మానేసి ఎంపీ గారు దీక్ష చేపడుతున్నారు. అచ్చం తమ అధి నాయకుడు నారా చంద్రబాబు తరహాలోనే ప్రజల కోసం ఈ దీక్షట. తనను ఎన్నుకున్న ప్రజలంతా కష్టాలలో ఉంటే తాను పుట్టిన రోజు పండుగలు చేసుకోవడం భావ్యం కాదంటున్నరు ఎంపీ గారు.
హోదా కోసం
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. రైల్వే జోన్ విశాఖకు ఇవ్వలేదు, విభజన హామీలు అంతకంటే నెరవేర్చలేదు. ప్రత్యేక ప్యాకేజి కూడా ఇవ్వలేదు. అందువల్ల ఏమీ ఇవ్వకుండా మోసం చెస్తున్న కేంద్రం వైఖరిని ఎండగడుతూ రోజంతా పస్తులు ఉండాలరి ఎంపి గారు నిర్ణయించుకున్నారు. మద్దతుదారులతో పాటు జనాలకు కూడా ఎంపి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారండోయ్. తనకు ఎవరూ శుభాకాంక్షలు చెప్పవద్దని విజ్ఞప్తి చేసిన ఎంపి తనతో పాటు దీక్షలో కూర్చుంటే చాలన్నారు. తనతో పాటు దీక్షలో కూర్చోవటమే పది వేల గ్రీటింగులంటున్నారు. తన అనుచరులంతా దీక్షలో పాల్గొనాలని కూడా ఆయన కోరుతున్నారు. ఇదేం గోలరా బాబు అని మద్దతుదారులు అనుకున్నా చివరకి వాళ్ళ వరకూ తప్పేట్లు లేదు చూడబోతే.
కడుపు మంట దీక్షట
తమ అధినాయకుడు చంద్రబాబు తన స్థాయి, అనుభవాన్ని సైతం మరచి డిల్లీ చుట్టూ 29 సార్లు తిరిగినా కేంద్రంలోని బీజేపీ సర్కార్ పట్టించుకోనందుకు తనతో పాటు ఏపీ ప్రజలందరికీ కూడా కడుపులో మంటగా ఉందని ముత్తంశెత్తి సెలవిచ్చారు. ఆ మంట ముందు ఈ ఆకలి మంట ఏ మాత్రమని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. పూచిక పుల్లంత కూడా ఎంపీలకు డిల్లీలో విలువ లేకుండా పోయిందని, అక్కడ తమ గోడు వినే వారు ఎవరూ లేనందువల్లనే గల్లీ లోనే దీక్ష చేస్తున్నానని ఎంపీ అంటున్నారు. ఈ దీక్షతోనైనా కేంద్రం కళ్ళు తెరవాలని కోరుతున్నారు. మరి ఇలా గల్లీలో అన్న పానాలు మానేసి దీక్షలు చేస్తే సమస్యలు తీరుతాయకుంటే వీళ్ళకు ఎంపీ, ఎమ్మెల్యే పదవులెందుకు, ఎన్నికలెందుకని జనాలు సెట్టైర్లు వేస్తున్నారు. ఎంచక్కా నాలుగేళ్ళ పాటు ఘనంగా పుట్టిన రోజులు చేసుకుని ఎన్నికల ఏడాదిలో తగుదునమ్మా అని ఆర్భాట దీక్షలు చేసి ఓట్లు రాల్చుకోవాలని చూడడం సిసలైన రాజకీయమని విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎంపీ దీక్ష ఇలా రాజకీయ ఆరోపణలకు వేదిక అవుతోంది.