ఏపీలో అధికార టీడీపీ నుంచి ఇప్పుడిప్పుడే విపక్ష వైసీపీలోకి వలసలు స్టార్ట్ అయ్యాయి. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు టార్గెట్గా కొందరు, మంత్రి పదవులు, ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న కోరికతో మరికొందరు ఇతర పార్టీల్లోకి జంప్ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మంత్రి అవ్వాలన్న కోరికతో తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్న భీమిలి నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ ప్రకటనే మంత్రి గంటాకు, అవంతికి మధ్య తీవ్రమైన గ్యాప్కు కారణమైన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో ఎంపీ సైతం అసెంబ్లీ సీటుపై కన్నేసినట్టు తెలుస్తోంది. గతంలో మంత్రిగా పనిచేసిన తోట నరసింహం గత ఎన్నికలకు ముందు చివరి క్షణంలో టీడీపీలోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా పోటీ చేసి కేవలం 3 వేల ఓట్ల తేడాతో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో తోట టీడీపీ తరపున జగ్గంపేట సీటు ఆశించినా అక్కడ జ్యోతుల నెహ్రూ బలంగా ఉండడం, ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి రావడంతో ఆ పాచిక పారలేదు.
ఆ తర్వాత తోట కాపులు బలంగా ఉన్న పిఠాపురంపై కన్నేశారు. అక్కడ గత ఎన్నికల్లో టీడీపీ సీటు ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేసి 50 వేల మెజార్టీతో గెలిచిన వర్మను తప్పించరని తోటకు అర్థమైంది. ఈ క్రమంలోనే ఆయన ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలన్న ఉద్దేశంతో వైసీపీ నాయకులతో టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అసెంబ్లీకి పోటీ చేసి ఆ పార్టీ నుంచి అయినా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టాలన్న టార్గెట్తోనే తోట పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద హాట్ టాపిక్గా మారింది. గతంలో కేబినెట్లో మంత్రిగా పవర్ రుచి చూసిన ఆయనకు ఎంపీ పదవి అంత కిక్ ఇవ్వలేదట. ఈ క్రమంలోనే ఆయన ఇప్పుడు టీడీపీలో ఛాన్స్ రాకపోతే వైసీపీలోకి జంప్ చేసినా అయినా ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న గట్టి నిర్ణయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన లోపాయికారిగా వైసీపీ వాళ్లతో టచ్లో ఉన్నారని టాక్.