పాదయాత్రలో ఉన్న జగన్ బిసి సామాజికవర్గాలకు మరో హామీనిచ్చారు. పార్టీకి రాబోయే ఎంఎల్సీ స్ధానాలన్నింటినీ ఇక నుండ బిసిలకు ప్రాతినిధ్యం లేని కులాలకే కేటాయిస్తానంటూ ప్రామిస్ చేశారు. రాబోయే ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటు స్ధానాన్ని బిసిలకే కేటాయిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్లమెంటు టిక్కెట్టును జగన్ బిసిలకు ప్రకటించగానే రాజకీయంగా అన్నీ పార్టీల్లో కలకలం రేగుతోంది. ఎందుకంటే, ఈ పార్లమెంటు పరిధిలోని మొత్తం ఓట్లలో సగానికన్నా ఎక్కువగా బిసిల ఓట్లే ఉన్నాయి.అయినా ఇప్పటి వరకూ ఏ పార్టీ కూడా బిసి అభ్యర్ధిని పెట్టకపోవటం గమనార్హం. ఈ సీటును తమకే కేటాయించాలని చాలా కాలంగా బిసి సామాజికవర్గాలు డిమాండ్ చేస్తున్న ఏ పార్టీ కూడా పట్టించుకోలేదు.
ఇటువంటి నేపధ్యంలో పార్లమెంటు సీటును బిసిలకు కేటాయిస్తున్నట్లు జగన్ చేసిన ప్రకటన నిజంగానే ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్ కూడా ఆ ప్రకటనను వ్యూహాత్మకంగానే చేశారన్నది వాస్తవం. టిడిపిని దెబ్బకొట్టటమే ఏకైక లక్ష్యంతో పావులు కదుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. బిసిలను టిడిపికి దూరం చేస్తే కానీ అధికారం అందుకోవట కష్టమని జగన్ గ్రహించారు. అందులో భాగంగానే జగన్ పై ప్రకటన చేశారు.
జగన్ ప్రకటనతో మంచి జోష్ మీదున్న బిసిలకు తాజాగా మరో హామీ ఊపునిస్తోంది. భవిష్యత్తులో తమ పార్టీ కేటాయించే ఎంఎల్సీ సీట్లన్నింటినీ బిసిలకే కేటాయిస్తానంటూ మరో హామీ ఇచ్చారు. అంటే రాజమండ్రి ఎంపి సీటు ప్రకటనతో పాటు ఎంఎల్సీ సీట్లను కూడా బిసిలకే కేటాయిస్తానని హామీ ఇవ్వటమంటే మాటలు కాదు. అందుకే బిసి సామాజికవర్గాల్లో ఇపుడు మంచి జోష్ కనిపిస్తోంది. జగన్ తాజాగా ఇచ్చిన హామీలతో వచ్చే ఎన్నికల్లో బిసిలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే.