ఎవరితోనైనా ప‌రవాలేదు కానీ ఏపీతోను  మా బాబుతోనూ పెట్టుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవంటూ  బీజేపీకి  విశాఖ టీడీపీ  నాయకులు వార్నింగులిచ్చేశారు. ఏపీ అంటే అంత చులకన అంటూ మండి పడ్డారు. హామీలు మరచి మమ్మల్నే పక్కన పెట్టాలనుకుంటే కుదిరే పని కాదన్నారు.  తన పుట్టిన రోజైన మంగళవారం నాడు అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస రావు విభజన హమీల అమలు కోసం కడుపు మాడ్చుకుని  మరీ ఒక రోజు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా  ముత్తంశెట్టితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేష్ బాబు, పీల గోవింద సత్యనారాయణ .అనిత  బీజేపీపై ఓ రేంజి లో ఫైర్ అయిపోయారు. ఏపీతో ఆటలాడితే మీకే కష్టమంటూ బీజేపీని కడిగిపారేశారు

బీజేపీ వల్లనే


పుట్టిన రోజు నాడు హాయిగా కడుపు నిండా తింటారు ఎవరైనా. బీజేపీ నేతలు చేసిన మోసానికి కడుపు మండి మా టీడీపీ నాయకులు పస్తులు ఉంటున్నారు. మాకు ఇదేం ఖర్మంటూ తెలుగుదేశం నాయకులు కమలం పార్టీపై గుస్సా అయ్యారు. హోదా ఇవ్వకపోతే మీకు కూడా రాజకీయ పస్తులు తప్పవంటూ ఏకంగా శాపనార్ధాలే పెట్టీశారు. మమ్మల్నీ మా నాయకుడు చంద్రబాబుని  డిల్లీలో  మీ చుట్టూ తిప్పించుకుని ఇప్పుడు తప్పించుకుంటారా  ఇదేం రాజకీయమంటూ అటాక్ చేశారు.

హోదా దెబ్బతోనే ఓటమి
కర్ణాటకలో బీజేపీకి హోదా దెబ్బ తగిలిందని, అందుకే అధికారానికి దూరమైందని  తెలుగుదేశం నాయకులు అన్నారు. ఇప్పటికైనా హోదా ఇవ్వకపోతే రేపటి రోజున ఏపీతో పాటు కేంద్రంలోనూ ఓట్లు రాలే పరిస్థితే ఉండదని జోస్యం చెప్పారు. కమలనాధులు కాస్తైనా మాట మన్నించాలని, జనం బాధలను గుర్తించాలని  తప్పించుకుంటే మాత్రం పంగ నామాలు తప్పవంటూ హెచ్చరించారు.

హోదా ఇస్తే మీదే ఏపీ


అంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తే ఏపీ మొత్తం మీకే మద్దతు ఇస్తుందంటూ ఓ బంపర్ ఆఫర్ ని తెలుగుదేశం నాయకులు బీజేపీకి ఇచ్చేశారు.  బీజేపీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ప్రజలు నెత్తిన పెట్టుకుంటారంటూ పాత మిత్రునికి ఓ మంచి సలహ ఇచ్చేశారు. మా మాట వింటే బాగుపడతారు లేకపోతే చెడతారంటూ శ్రీక్రిష్ణ రాయబారం సీన్ మాదిరి రక్తి కట్టించారు. తిరుపతి వెంకన్న సాక్షిగా హోదా ఇస్తామన్నారు. వెంటనే ఇచ్చేయకపోతే పాపాలూ.. శాపాలు వెంట తగులుతాయంటూ  శాప‌నార్ధాలు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: